Wedding Date Confirmed: టీమిండియా క్రికెటర్ రింకు సింగ్, సమాజ్వాదీ పార్టీ ఎంపీ ప్రియా సరోజ్ వివాహ తేదీ ఖరారైంది. ఇరు కుటుంబాల సమ్మతితో డిసెంబర్ 4, 2026న లక్నోలోని రమాడా హోటల్లో వీరి వివాహం జరగనుంది. పెళ్లి తేదీ, వేదిక ఖరారు కావడంతో ఇరు కుటుంబాలు వివాహ ఏర్పాట్లలో నిమగ్నమయ్యాయి.
రింకు సింగ్, ప్రియా సరోజ్ల ఎంగేజ్మెంట్ 2025 జూన్ 8న లక్నోలోని ‘ది సెంట్రమ్’ హోటల్లో జరిగింది. కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో జరిగిన ఈ ప్రైవేట్ వేడుక అప్పట్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఎంగేజ్మెంట్ తర్వాత వీరి వివాహంపై చాలా కాలంగా చర్చ కొనసాగుతోంది.
ఆ చర్చలకు తెర దించుతూ.. ఇప్పుడు డిసెంబర్ 4న లక్నోలోని రమాడా హోటల్లో వివాహం నిర్వహించాలని నిర్ణయించారు. వివాహ వేడుకకు కుటుంబ సభ్యులు, బంధువులు, సన్నిహితులతో పాటు క్రికెట్, రాజకీయ రంగాలకు చెందిన కొందరు ప్రముఖులు హాజరయ్యే అవకాశం ఉన్నట్లు పలు నివేదికలు పేర్కొన్నాయి.
ప్రియా సరోజ్ ఉత్తరప్రదేశ్లోని మచ్లీషహర్ లోక్సభ నియోజకవర్గం నుంచి సమాజ్వాదీ పార్టీ తరఫున ఎంపీగా ఉన్నారు. 2024 లోక్సభ ఎన్నికల్లో ఆమె మచ్లీషహర్ నుంచి విజయం సాధించి పార్లమెంట్లో అడుగుపెట్టారు. ఆమె తండ్రి తూఫానీ సరోజ్ కూడా సమాజ్వాదీ పార్టీకి చెందిన రాజకీయ నాయకుడు, ప్రస్తుతం కేరాకత్ ఎమ్మెల్యేగా ఉన్నారు.
రింకు సింగ్ భారత క్రికెట్లో ముఖ్యంగా టీ20 ఫార్మాట్లో తన దూకుడైన బ్యాటింగ్తో గుర్తింపు పొందాడు. ఒకే ఓవర్లో వరుసగా ఐదు సిక్సర్లు బాదిన ఇన్నింగ్స్తో అతడు క్రికెట్ అభిమానుల దృష్టిని ఆకర్షించాడు. ప్రియా సరోజ్తో అతని నిశ్చితార్థం తర్వాత వీరి వివాహం ఎప్పుడు జరుగుతుందనే ఆసక్తి కొనసాగింది. ఇక ఎట్టకేలకు వివాహ తేదీ, వేదిక ఖరారు కావడంతో రింకు సింగ్, ప్రియా సరోజ్ వివాహానికి సంబంధించిన ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి.

