RCB vs MI: ఐపీఎల్ 2026లో భాగంగా ముంబై ఇండియన్స్తో జరుగుతున్న మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. టాస్ గెలిచిన ముంబై బౌలింగ్ ఎంచుకోగా.. ఆ నిర్ణయం తప్పని నిరూపిస్తూ ఆర్సీబీ ఓపెనర్లు వారి జట్టుకు అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు. వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన ఈ హై-వోల్టేజ్ పోరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పరుగుల వరద పారించింది. ఫిలిప్ సాల్ట్, రజత్ పాటిదార్ మెరుపు దాడికి తోడు చివర్లో టిమ్ డేవిడ్ సిక్సర్లతో విరుచుకుపడటంతో నిర్ణీత 20 ఓవర్లలో ఆర్సీబీ 3 వికెట్ల నష్టానికి 240 పరుగుల భారీ స్కోరు సాధించింది.
READ ALSO: Moringa Powder: జిమ్కి వెళ్లక్కర్లేదు.. రోజుకు రెండు ముద్దల ఈ పొడి తింటే కొవ్వు కరగాల్సిందే!
సాల్ట్ మెరుపులు.. కోహ్లీ క్లాస్
ఓపెనర్ ఫిలిప్ సాల్ట్ కేవలం 36 బంతుల్లోనే 6 ఫోర్లు, 6 సిక్సర్లతో 78 పరుగులు చేసి ముంబై బౌలర్లను వణికించాడు. మరోవైపు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (38 బంతుల్లో 50) ఆరంభంలో నెమ్మదిగా ఆడినా, కీలకమైన అర్ధశతకంతో ఇన్నింగ్స్కు వెన్నుముకగా నిలిచాడు. వీరిద్దరూ కలిసి మొదటి వికెట్కు 115 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. సాల్ట్ అవుట్ అయిన తర్వాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్ రజత్ పాటిదార్ విధ్వంసం సృష్టించాడు. కేవలం 17 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న పాటిదార్, మొత్తంగా 20 బంతుల్లో 53 పరుగులు (4 ఫోర్లు, 5 సిక్సర్లు) చేసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. చివర్లో టిమ్ డేవిడ్ (14 బంతుల్లో 34 నాటౌట్) ఆఖరి బంతిని సిక్సర్గా మలిచి ఇన్నింగ్స్ను ఘనంగా ముగించాడు. దీంతో ఆర్సీబీ సరిగ్గా 240 పరుగులు చేసింది.
ముంబై బౌలర్లు విలవిల..
ముంబై బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్ 4 ఓవర్లలో 45 పరుగులిచ్చి ఒక వికెట్ తీయగా.. హార్దిక్ పాండ్యా, శార్దూల్ ఠాకూర్ చెరో వికెట్ పడగొట్టారు. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా (4 ఓవర్లలో 36 పరుగులు) ఈ మ్యాచ్లోనూ వికెట్ తీయలేకపోయాడు. గత 5 మ్యాచ్లుగా బుమ్రా వికెట్ తీయకపోవడం గమనార్హం. ఈ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ గెలవాలంటే 20 ఓవర్లలో 241 పరుగులు చేయాలి. వాంఖడే పిచ్ బ్యాటింగ్కు అనుకూలిస్తుండటంతో చేజింగ్ ఆసక్తికరంగా మారింది.
READ ALSO: Chanakya Niti: మీ మాటకు విలువ పెరగాలంటే ఏం చేయాలి? ఆచార్య చాణక్యుడు చెప్పిన బెస్ట్ టిప్స్ ఇవే..