NTV Telugu Site icon

RBI: బ్యాంక్ కస్టమర్లకు షాక్.. ఏటీఎం ఛార్జీలు పెంపు.. అమల్లోకి ఎప్పటినుంచంటే?

Atm

Atm

డిజిటల్ పేమెంట్ యాప్స్ అందుబాటులోకి వచ్చాక ఏటీఎంలకు వెళ్లేవారి సంఖ్య కాస్త తగ్గిందనే చెప్పాలి. అయినప్పటికీ చాలామంది ఏటీఎం సేవలను వినియోగించుకుంటున్నారు. అయితే బ్యాంక్ కస్టమర్లకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా షాకిచ్చింది. ఆర్బీఐ ఏటీఎం ఇంటర్‌చేంజ్ ఫీజుల పెంపుకు ఆమోదం తెలిపింది. ఆర్థిక లావాదేవీలకు రూ.2, ఆర్థికేతర లావాదేవీలకు రూ.1 చొప్పున ఛార్జీలను పెంచింది. మే 1 నుంచి పెంచిన ఛార్జీలు అమల్లోకి రానున్నాయి. ఛార్జీల పెంపు పరిమిత ఏటీఎం నెట్‌వర్క్ కలిగిన చిన్న బ్యాంకులపై ఎక్కువ ప్రభావాన్ని చూపుతుందని బ్యాంకు వర్గాలు భావిస్తున్నాయి.

Also Read:Hyderabad: మండి రెస్టారెంట్స్లో ఫుడ్ సేఫ్టీ అధికారుల సోదాలు.. పాడైపోయిన చికెన్, బొద్దింకలు దర్శనం

అయితే పెరిగిన ఇంటర్‌చేంజ్ ఫీజులను కస్టమర్లకు బదిలీ చేయాలా వద్దా అనే దానిపై బ్యాంకులు ఇంకా నిర్ణయం తీసుకోలేదు. కానీ దీనిపై జరుగుతున్న చర్చలు చివరికి కస్టమర్లు ఆ భారాన్ని భరించాల్సి ఉంటుందని సూచిస్తున్నాయి. గత 10 సంవత్సరాలుగా ఇంటర్‌చేంజ్ ఫీజులు సవరించబడినప్పుడల్లా, బ్యాంకులు కస్టమర్లకు బదిలీ చేశాయి. ఇప్పుడు కూడా బ్యాంకులు కస్టమర్లకు ఫీజులను పెంచే ఛాన్స్ ఉందని సీనియర్ బ్యాంక్ అధికారి వెల్లడించారు.

Also Read:Nitish Kumar Reddy Marriage: బ్రో లవ్ మ్యారేజా.. నితీశ్ రెడ్డి సమాధానం ఇదే (వీడియో)!

ఏటీఎం ఇంటర్‌చేంజ్ ఫీజు అనేది ఏటీఎం సేవలను ఉపయోగించడానికి ఒక బ్యాంకు మరొక బ్యాంకుకు చెల్లించే ఛార్జీ. ఈ రుసుము సాధారణంగా లావాదేవీలో ఒక శాతంగా ఉంటుంది. ఆర్బీఐ గతంలో జూన్ 2021లో ఇంటర్‌చేంజ్ ఫీజులను సవరించింది. నగదు ఉపసంహరణ వంటి ఆర్థిక లావాదేవీలకు ఇంటర్‌ఛేంజ్ ఫీజును రూ.17 నుంచి రూ.19కి పెంచారు. బ్యాలెన్స్ ఎంక్వైరీ వంటి ఆర్థికేతర లావాదేవీలకు రూ.6 నుంచి రూ.7కి పెంచారు. ప్రస్తుతం మెట్రో ప్రాంతాల్లోని ఒక బ్యాంకు కస్టమర్ ఇతర బ్యాంకుల ఏటీఎంలలో నెలకు ఐదు, మెట్రోయేతర ప్రాంతాలలో మూడు ఫ్రీ ట్రాన్సాక్షన్స్ చేసుకోవచ్చు.

Also Read:Bollywood : ఖాన్స్‌ను టార్గెట్ చేస్తోన్న తమిళ స్టార్ డైరెక్టర్

ఇంటర్‌చేంజ్ ఫీజుల పెంపును అనుమతించే నిర్ణయాన్ని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) మార్చి 13న బ్యాంకులు, ఇతర వాటాదారులకు తెలియజేసిందని బ్యాంకు వర్గాలు తెలిపాయి. ప్రస్తుత ఫీజులతో కార్యకలాపాలను నిర్వహించడం ఆర్థికంగా కష్టంగా ఉందని భావిస్తున్న వైట్-లేబుల్ ఏటీఎం ఆపరేటర్ల అభ్యర్థనల మేరకు ఇంటర్‌చేంజ్ ఫీజును పెంచినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.