Rajya Sabha Elections: దేశవ్యాప్తంగా ఏడు రాష్ట్రాల్లో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో 26 మంది అభ్యర్థులు పోటీ లేకుండానే ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఏకగ్రీవమైన వారిలో శరద్ పవార్ (NCP), రాందాస్ అథవాలే, అభిషేక్ మను సింఘ్వి, తంబి దురై, వినోద్ తవ్డే, బాబుల్ సుప్రియో వంటి దిగ్గజ నేతలు ఉన్నారు. అయితే, బీహార్, ఒడిశా, హర్యానా రాష్ట్రాల్లో మాత్రం అభ్యర్థులు బరిలో ఉండటంతో పోలింగ్ అనివార్యమైంది.
READ ALSO: UAE: యుఏఈలో 35 మంది అరెస్టుకు ఆదేశం.. మెజారిటీ భారతీయులే!
బీహార్: కుష్వాహా వర్సెస్ ఏడీ సింగ్
బీహార్లో ఐదు స్థానాలకు గాను నితీష్ కుమార్, రామ్నాథ్ ఠాకూర్ (JDU), నితిన్ నబిన్, శివం కుమార్ (BJP) విజయం ఖాయమైంది. అయితే, ఐదో సీటు కోసం ఎన్డీయే అభ్యర్థి ఉపేంద్ర కుష్వాహా, మహాఘటబంధన్ అభ్యర్థి ఏడీ సింగ్ మధ్య గట్టి పోటీ నెలకొంది. ఈ సీటును గెలవడానికి 41 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం కాగా, ప్రస్తుతం విపక్ష కూటమికి 35 మంది ఉన్నారు. తేజస్వి యాదవ్కు మద్దతుగా AIMIM ఎమ్మెల్యేలు నిలవడంతో పోరు ఆసక్తికరంగా మారింది.
ఒడిశా: క్రాస్ ఓటింగ్పైనే ఆశలు!
ఒడిశాలో ఒక సీటు గెలవడానికి 30 ఓట్లు అవసరం. ఇక్కడ బీజేపీకి ఇద్దరు, బీజేడీకి ఒక అభ్యర్థి విజయం సులభమే. కానీ, బీజేపీ మద్దతుతో బరిలో ఉన్న దిలీప్ రే గెలవాలంటే మరో 8 ఓట్లు అదనంగా కావాలి. కాంగ్రెస్, బీజేడీకి చెందిన కొంతమంది ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ చేస్తారనే నమ్మకంతో బీజేపీ వర్గాలు ఉన్నాయి. ప్రస్తుతం కాంగ్రెస్, సీపీఎం కలిసి 33 ఓట్లతో ఒక స్థానాన్ని గెలుచుకునే స్థితిలో ఉన్నాయి.
హర్యానా: క్యాంప్ రాజకీయాలు షురూ!
హర్యానాలో బీజేపీ అభ్యర్థి సంజయ్ భాటియా, కాంగ్రెస్ అభ్యర్థి కరంవీర్ బోధ్ గెలుపు దాదాపు ఖాయం. కానీ, స్వతంత్ర అభ్యర్థి సతీష్ నందల్ రంగంలోకి దిగడంతో సమీకరణాలు మారాయి. క్రాస్ ఓటింగ్ జరుగుతుందనే భయంతో కాంగ్రెస్ తన 31 మంది ఎమ్మెల్యేలను హిమాచల్ ప్రదేశ్కు తరలించింది. అయితే, భూపిందర్ సింగ్ హుడా, వినేష్ ఫోగట్ సహా ఆరుగురు ఎమ్మెల్యేలు ఈ క్యాంప్కు వెళ్లకపోవడం చర్చనీయాంశంగా మారింది.
నేడు (సోమవారం) జరగనున్న పోలింగ్లో ఈ మూడు రాష్ట్రాల ఫలితాలు ఎవరిని వరిస్తాయనేది ఉత్కంఠ రేపుతోంది. క్రాస్ ఓటింగ్ జరిగితే ఫలితాలు తలకిందులయ్యే అవకాశం ఉంది.