Site icon NTV Telugu

SS Rajamouli: ప్రపంచ సినిమాను ఏలబోతున్న ‘వారణాసి’.. ఇండియన్ సినిమా దిశను మార్చబోతున్న జక్కన్న!

Ss Rajamouli Varanasi

Ss Rajamouli Varanasi

SS Rajamouli: ‘మగధీర’, ‘ఈగ’, ‘బాహుబలి’, ‘RRR’.. ఇలా సినిమా సినిమాకు భారతీయ చిత్ర పరిశ్రమ స్థాయిని పెంచుకుంటూ పోతున్నారు దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి. ఇప్పుడు ఆయన దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘వారణాసి’. ఈ సినిమా భారతీయ సినిమాను మరో మెట్టు ఎక్కించడం కాదు, ఏకంగా ఒక ‘క్వాంటం లీప్’ తీసుకోబోతోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ సినిమాలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ వంటి భారీ తారాగణం నటిస్తున్నారు. అనుకున్న టైంకి ప్రేక్షకుల ముందుకు సినిమాను తీసుకురావడానికి జక్కన్న ఈ సినిమా షూటింగ్ పనుల్లో వేగం పెంచారు. అయితే ఈసారి ఆయన కేవలం కథపైనే కాదు, ఇండియన్ సినిమా సాంకేతిక ముఖచిత్రాన్ని మార్చేసే భారీ ప్రణాళికలతో ముందుకు సాగుతున్నారని సమాచారం.

READ ALSO: US-Iran Talks: చర్చలకు ముందే ఇరాన్ విజయం.. డబ్బులు తిరిగి ఇచ్చేందుకు అమెరికా ఓకే..

సొంతంగా ఏఐ-ఆధారిత విఎఫ్ఎక్స్ (VFX) స్టూడియో..
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. రాజమౌళి ఒక అత్యాధునిక ఏఐ (AI) ఆధారిత VFX స్టూడియోను ఏర్పాటు చేసే పనిలో ఉన్నారని సమాచారం. దీని కోసం ఆయన ఒక అంతర్జాతీయ విఎఫ్ఎక్స్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు, అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కూడా చర్చలు జరుపుతున్నట్లు టాక్ నడుస్తుంది. భారతదేశంలోనే అత్యంత ఆధునికమైన ఈ స్టూడియో, భవిష్యత్తులో మన సినిమాలకు విదేశీ కంపెనీలపై ఆధారపడే అవసరాన్ని తగ్గిస్తుందని చెబుతున్నారు. నిజానికి ఇండియా విఎఫ్ఎక్స్ పనులకు ప్రపంచ కేంద్రంగా ఉన్నప్పటికీ, మన కంపెనీలు ఎక్కువగా ‘ఇమేజ్ క్లీనింగ్’, ‘బ్యాక్‌గ్రౌండ్ సెట్టింగ్’, ‘క్రౌడ్ మల్టిప్లికేషన్’ వంటి పనులకే పరిమితమవుతున్నాయి. హాలీవుడ్ సంస్థలు మనకు క్రియేటివ్ కంట్రోల్‌కు అవకాశం ఇవ్వవు. క్లిష్టమైన జీవులను (Creatures) సృష్టించడంలో, వాటిని నటులతో వాస్తవికంగా మేళవించడంలో మనం ఇంకా విదేశీ కంపెనీలపైనే ఆధారపడుతున్నాం. ఉదాహరణకు చూసుకుంటే ‘RRR’లో రామ్ చరణ్ ఇంట్రో సీన్‌లోని వేల మంది జనాన్ని భారతీయ కంపెనీ సృష్టించగా, ఎన్టీఆర్ ఇంట్రోలోని ‘పులి’ని మాత్రం విదేశీ కంపెనీలు రూపొందించాల్సి వచ్చింది.

నిజానికి ‘RRR’ సమయంలో ఎన్టీఆర్ ఒక నీలి రంగు బొమ్మను చూస్తూ పులి అనుకొని నటించాల్సి వచ్చింది. అందుకే ఇప్పుడు జక్కన్న జేమ్స్ కామెరూన్ ‘అవతార్’ సినిమాలో వాడినట్లుగా, నటులు షూటింగ్ చేస్తున్నప్పుడే తమ చుట్టూ ఉండే డిజిటల్ ప్రపంచాన్ని రియల్ టైమ్‌లో చూసే సాంకేతికతను తీసుకురాబోతున్నాట. దీంతో ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ‘వారణాసి’ కోసం రాజమౌళి తీసుకురాబోతున్న ఈ కొత్త టెక్నాలజీతో, నటులు తాము ఏ వాతావరణంలో ఉన్నామో ముందే గ్రహించి మరింత సహజంగా నటించే వీలుంటుందని చెబుతున్నారు.

ఒకవేళ రాజమౌళి ఆశిస్తున్నట్లుగా అంతర్జాతీయ స్థాయి స్టూడియో ఇక్కడే అందుబాటులోకి వస్తే దాంతో ప్రయోజనాలు ఏంటంటే.. సినిమా బడ్జెట్ గణనీయంగా తగ్గుతుంది. అలాగే వేర్వేరు కంపెనీల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా పనులు ఫాస్ట్‌గా పూర్తవుతాయి. ఇదే సమయంలో అవుట్‌పుట్ నాణ్యత కూడా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ఉంటుంది. రాజమౌళి తన ‘వారణాసి’ మూవీ కోసం సిద్ధం చేస్తున్న మరో రెండు భారీ సాంకేతిక అప్‌గ్రేడ్‌ల వివరాలు కూడా త్వరలోనే వెల్లడి కానున్నాయని సమాచారం. ఇండియన్ సినిమా గర్వించదగ్గ స్థాయికి ఈ చిత్రం చేరుకుంటుందని అభిమానులు, విశ్లేషకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

READ ALSO: Indian Players Struggle: ఈ భారత స్టార్ ప్లేయర్లకు ఏమైంది?.. ఐపీఎల్ 2026లో తడబడుతున్న టాప్ స్టార్స్!

Exit mobile version