Rajamahendravaram: తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో కల్తీ పాలు తాగి అనారోగ్యానికి గురైన ఘటనలో రోజుకో ప్రాణం గాల్లో కలుస్తోంది. తాజాగాఈ ఘటనలో మరో మహిళ మృతి చెందారు. లాలాచెరువు ప్రాంతానికి చెందిన జి. వెంకటలక్ష్మి (69) చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. ఆమె రాజమండ్రిలోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ ఘటనలో ఇప్పటివరకు మృతుల సంఖ్య 9కు చేరింది. గత నాలుగు రోజులుగా వరుసగా ప్రతిరోజూ ఒక్కొక్కరు మృతి చెందడం స్థానికంగా ఆందోళన కలిగిస్తోంది. కల్తీ పాలు తాగి అస్వస్థతకు గురైన మరో 11 మంది ప్రస్తుతం నాలుగు వేర్వేరు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వీరిలో ఏడుగురు వెంటిలేటర్పై ఉండి డయాలసిస్ చికిత్స తీసుకుంటుండగా, మరో నలుగురికి డయాలసిస్ నిర్వహిస్తున్నారు. ఈ ఘటనపై అధికారులు విచారణ కొనసాగిస్తుండగా, బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు.