Pakistan vs New Zealand: వర్షం పాకిస్థాన్ కొంప ముంచింది. శనివారం శ్రీలంక రాజధాని కొలంబోలో జరగాల్సిన పాకిస్థాన్ vs న్యూజిలాండ్ టీ20 వరల్డ్ సూపర్ ఎయిట్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. ఈ మ్యాచ్కు రిజర్వ్ డే సైతం లేదు. దీంతో చేసేదేమి లేక రెండు జట్లకు ఒక్కో పాయింట్ ఇచ్చారు. వర్షం కారణంగా ఇరు దేశాలకు గడ్డు కాలంగా మారింది. సెమీఫైనల్ అవకాశాలు సన్నగిల్లాయి. పాకిస్థాన్ ఇప్పుడు ఇంకా రెండు మ్యాచ్లు ఆడాల్సి ఉంది. ఇంగ్లాండ్, శ్రీలంకలతో పాక్ పోటీ పడాల్సి ఉంది. సల్మాన్ అలీ ఆఘా సారథ్యంలోని జట్టు ఈ రెండు మ్యాచ్ల్లో గెలిస్తే మొత్తం 5 పాయింట్లతో సెమీఫైనల్కు చేరే అవకాశాలు బలంగా ఉంటాయి. ఒకటి గెలిచి, ఒకటి ఓడితే 3 పాయింట్లతో ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది. రెండు మ్యాచ్లూ ఓడిపోతే పాకిస్థాన్ ఇంటి బాట పట్టాల్సిందే.
READ MORE: Healthy Protein Snacks: శెనగపిండి లేని హెల్తీ ప్రోటీన్ పకోడీ.. ఇలా ‘సింపుల్’గా చేసుకోండి!
అయితే.. నేడు స్వల్పంగా వర్షం పడుతుండగా టాస్ ముగిసింది. టాస్ గెలిచిన పాకిస్థాన్ బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే ఆ తేలికపాటి జల్లులు క్రమంగా భారీ వర్షంగా మారడంతో ఒక్క బంతి కూడా వేయకుండానే అంపైర్లు మ్యాచ్ను రద్దు చేశారు. ఈ మ్యాచ్ కోసం పాకిస్థాన్ తమ జట్టులో ఒక మార్పు సైతం చేసింది. ఖవాజా నఫాయ్ స్థానంలో ఫఖర్ జమాన్ను తుదిజట్టులోకి తీసుకుంది. న్యూజిలాండ్ మాత్రం మూడు మార్పులతో బరిలోకి దిగింది. కెనడాతో జరిగిన మ్యాచ్ను అనారోగ్యం కారణంగా మిస్ చేసిన కెప్టెన్ మిచెల్ సాంట్నర్ తిరిగి జట్టులో చేరాడు. అతనితో పాటు లాకీ ఫర్గూసన్, ఇష్ సోధీకి కూడా అవకాశం ఇచ్చారు. ఈ మ్యాచ్ రద్దవ్వడంతో పాకిస్థాన్ డీలా పడింది. ఇక ఫిబ్రవరి 24న ఇదే వేదికలో ఇంగ్లాండ్తో, ఫిబ్రవరి 25న న్యూజిలాండ్ను దాయాది జట్టు ఎదుర్కోనుంది. దాయాది జట్టు ఇంటికి పయనమవుతుందా? రెండు మ్యాచ్లు గెలిచి సెమీస్ ఆడుతుందా? అనే అంశంపై అభిమానులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.