Jagannath Rath Yatra 2024: ఒడిశా రాష్ట్రంలోని పూరీ జగన్నాథుని తీర్థయాత్ర ఎంతో పవిత్రమైనది. ఈ యాత్రలో పాల్గొనేందుకు ప్రపంచ వ్యాప్తంగా భక్తులు లక్షలాది సంఖ్యలో తరలి వస్తుంటారు. హిందూ పంచాంగం ప్రకారం.. పూరీ జగన్నాథుని తీర్థయాత్ర ఆషాఢ మాసంలోని శుక్ల పక్షం రెండో రోజున జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది జగన్నాథ రథయాత్ర ఈ నెల 7వ తేదీ నుంచి ప్రారంభమై.. జూలై 16వ తేదీన ముగుస్తుంది. ఈ పవిత్రమైన యాత్రలో బలరాముడు, తన సోదరి సుభద్ర కూడా ఉంటారు. ఈ జగన్నాథుని రథయాత్రలో పాల్గొనడం వల్ల అన్ని తీర్థయాత్రల ఫలాలు దొరకుతాయని చాలా మంది భక్తులు నమ్ముతారు.
Read Also: Road Accident: ఎక్స్ప్రెస్ వే మీద వేగంగా దూసుకొచ్చి పల్టీలు కొట్టిన కారు.. యువకుడు మృతి
కాగా, ప్రఖ్యాత పూరీ జగన్నాథుడి రథయాత్ర మహోత్సవాల కోసం హాజరయ్యేందుకు భారీగా భక్తులు తరలి వచ్చే అవకాశం ఉంది. దీంతో భక్తుల సౌకర్యార్ధం రైల్వేశాఖ 315 ప్రత్యేక రైళ్లను నడిపేందుకు సిద్ధమైంది. ఒడిశాలోని బాదం పహాడ్, రూర్కెలా, బాలేశ్వర్, సోనేపుర్, దస్పల్లా, జునాగఢ్ రోడ్, సంబల్పుర్, కేందుజుహర్గఢ్, పారాదీప్, భద్రక్, అనుగుల్, గుణుపుర్ నుంచి స్పెషల్ ట్రైన్స్ స్టార్ట్ అవుతాయని ఈస్ట్ కోస్ట్ రైల్వే అధికారులు వెల్లడించారు. ఒడిశాలోని అన్ని ప్రధాన పట్టణాల మీదుగా రైళ్లు నడిచేలా అధికారులు రూట్ మ్యాప్ను సిద్ధం చేశారు. దక్షిణ మధ్య రైల్వే కూడా కొన్ని ప్రత్యేక ట్రైన్స్ ను నడిపే ఛాన్స్ ఉంది.