Rahul Gandhi’s Helicopter Checked By Election Officials In Tamil Nadu: లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అధికారులు ముమ్మర తనిఖీలు చేపడుతున్నారు. ముఖ్యంగా సరిహద్దుల్లో తనిఖీలను పెంచారు. తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్లో సోమవారం ఎన్నికల అధికారులు తనిఖీలు నిర్వహించారు. తమిళనాడులోని నీలగిరిలో అధికారులు తనిఖీలు చేపట్టారు. హెలికాప్టర్ ఇక్కడ ల్యాండ్ అయిన తర్వాత ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు సోదాలు నిర్వహించారని పోలీసులు తెలిపారు.
Read Also: Rajasthan: ట్రక్కును ఢీకొనడంతో కారులో మంటలు.. ఏడుగురు సజీవదహనం
నీలగిరి లోక్సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న డీఎంకే అభ్యర్థి ఎ.రాజాకు మద్దతుగా రాహుల్ గాంధీ సోమవారం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఉదయం హెలికాప్టర్ నీలగిరిలో ల్యాండ్ కాగా.. ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు సోదాలు చేపట్టారు. దాదాపు 10 నిమిషాల పాటు ఈ తనిఖీలు జరిగాయి. ఈ సోదాల్లో ఎలాంటి నగదు, వస్తువులు లభించలేదని అధికారులు వెల్లడించారు.
అనంతరం రాహుల్ గాంధీ ప్రచారం ముగించుకుని తన పార్లమెంటరీ నియోజకవర్గం కేరళలోని వయనాడ్కు వెళ్లారు. అక్కడ బహిరంగ సభతో సహా ప్రచార కార్యకలాపాల్లో పాల్గొన్నారు. వయనాడ్ నియోజకవర్గానికి ఏప్రిల్ 26న పోలింగ్ జరగనుంది. వయనాడ్ నుంచి రెండోసారి పోటీలో ఉన్న ఆయన ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నారు.