Raghu Rama Krishna Raju Case: డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో సీనియర్ ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ విచారణ ముగిసింది. కస్టోడియల్ టార్చర్ కేసులో ఏ1గా ఉన్న సునీల్ కుమార్ను విచారణకు రావాలని గతనెల 26న గుంటూరు పోలీసులు నోటీసులు ఇచ్చారు. కుటుంబ సభ్యులకు అనారోగ్యంతో ఉండటంతో విచారణకు రావడానికి పదిహేను రోజులు సమయం కోరారు. దీంతో డిసెంబరు15న విచారణకు రావాలని నోటీసులు ఇచ్చారు. గుంటూరు సీసీఎస్ కార్యాలయానికి వచ్చిన సునీల్ కుమార్ను విజయనగరం ఎస్పీ దామోదర్ విచారించారు. ఐదు గంటలపాటు కస్టోడియల్ టార్చర్ కేసులో సునీల్ కుమార్ను విచారించారు.సీఐడీ అధికారులు రఘురామకృష్ణంరాజును గుంటూరు రీజనల్ ఆఫీసుకు తీసుకొచ్చిన సమయంలో ఏం జరిగిందని ప్రశ్నించారు. రఘురామకృష్ణంరాజును విచారణ సమయంలో కొట్టారా? అని ప్రశ్నించారు. విచారణ సమయంలో ఎవరెవరు ఉన్నారని అడిగారు. అవసరమైతే మరోసారి విచారణకు పిలుస్తామని చెప్పినట్లు సమాచారం. విచారణలో సునీల్ కుమార్ పోలీసులు అడిగిన కొన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పకుండా దాటవేసినట్లు తెలుస్తుంది.