Russia Ukraine War : రష్యా ఉక్రెయిన్ దేశాల మధ్య పదినెలలుగా యుద్ధం నడుస్తోంది. రష్యా దాడులకి ఉక్రెయిన్ దేశం భారీగా నష్టపోయింది. దాదాపు తుడిచిపెట్టుకు పోయిందని చెప్పుకోవాలి. అంతలా నష్టం జరిగినా ఆ చిన్న దేశం రష్యాతో పోరాడడంలో తగ్గేదేలే అంటోంది. ఈ క్రమంలోనే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. యుద్ధానికి ముగింపు పలకాలని భావిస్తున్నట్లు ప్రకటించారు. ప్రపంచం మొత్తం రష్యాపై వేలెత్తి చూపిస్తున్న వేళ పుతిన్ నిర్ణయాన్ని అందరూ స్వాగతిస్తున్నారు. తాజాగా పుతిన్ మాట్లాడుతూ.. దౌత్యపరమైన చర్చల ద్వారా యుద్ధానికి ముగింపు పలకాలని కోరుకుంటున్నట్టు చెప్పారు.
Read Also: Omicron BF7: కరోనా బూస్టర్ డోస్ గా ముక్కులో చుక్కల మందు
శత్రుత్వం తీవ్రత భరించలేని నష్టాలకు దారితీస్తుందని తాను ఇప్పటికే పలుమార్లు చెప్పినట్టు పుతిన్ గుర్తు చేశారు. అన్ని సాయుధ ఘర్షణలు దౌత్య మార్గంలో ఏదో ఒకరమైన చర్చల ద్వారానో, లేదంటే మరోలానో ముగుస్తాయని పుతిన్ అన్నారు. మరోవైపు, తాము చర్చలకు రెడీగా ఉన్నట్లు చెబుతున్నప్పటికీ ఉక్రెయిన్ మాత్రం వ్యతిరేకిస్తోందని పుతిన్ అంటున్నారు. ఇదిలా ఉంటే, ఉక్రెయిన్ వాదన మరోలా ఉంది. చర్చలు జరగాలంటే తొలుత దాడులు ఆపి, తమ నుంచి స్వాధీనం చేసుకున్న భూభాగాన్ని తిరిగి అప్పగిస్తే అప్పుడు చూద్దామని ఉక్రెయిన్ దేశ అధ్యక్షుడు జెలెన్ స్కీ అంటున్నారు. వొలోదిమిర్ జెలెన్స్కీతో వైట్హౌస్లో సమావేశమైన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మాట్లాడుతూ.. ఉక్రెయిన్కు తమ మద్దతు కొనసాగుతుందని స్పష్టమైన హామీ ఇచ్చారు. ఆ తర్వాతి రోజునే పుతిన్ ఈ ప్రకటన చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.