Pulwama Attack 2019: ఫిబ్రవరి 14, 2019 దేశం మొత్తం ఒక్కసారిగా కుదేలైంది. భారతీయులు 40 మంది సైనికులను కోల్పోయింది. సరిగ్గా ఏడేళ్ల కిందట ఫిబ్రవరి 14న జమ్మూ కశ్మీర్లోని పుల్వామాలో సీఆర్పీఎఫ్ సైనిక వాహన శ్రేణిపై పాకిస్థాన్కు చెందిన జైషే మొహమ్మద్ ఉగ్రవాదులు ఆత్మాహుతికి దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్)కి చెందిన 40 సైనికులు బలయ్యారు. జమ్మూ- శ్రీనగర్ జాతీయ రహదారిపై లేత్పుర (అవంతిపురా సమీపం)లో 2019 ఫిబ్రవరి 14న సాయంత్రం 4 గంటల ప్రాంతంలో ఈ ఘాతుకం చోటుచేసుకుంది. ఈ దాడి అనంతరం దేశవ్యాప్తంగా కొవ్వొత్తుల ర్యాలీలు, శత్రు మూఖలను కఠినంగా శిక్షించాలని నినాదాలతో మార్మోగింది. ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయిన సైనికుల త్యాగాలను గుర్తు చేసుకుంటూ ఏటా బ్లాక్ డేగా భారతీయులు జరుపుకొంటారు. జవాన్లకు నివాళులర్పిస్తారు. వాస్తవానికి ఏటా ఫిబ్రవరి 14 రోజున ప్రేమికుల దినోత్సవం జరుపుకుంటారు. కానీ భారత్లో మాత్రం ఇది బ్లాక్ డే. 2019 నుంచి ఫిబ్రవరి 14ను పుల్వామాలో వీరమరణం పొందిన జవాన్లను స్మరించుకునే రోజుగా గుర్తిస్తున్నారు. ప్రేయసికి ఇచ్చే పూలకు బదులుగా.. వీరమరణం పొందిన జవాన్లు వద్ద పుష్పాలు, కొవ్వొత్తులు ఉంచి నివాళి తెలియజేస్తున్నారు. పుల్వామా ఎలా జరిగింది? ఆ దాడిలో మరణించిన జవాన్ల పేర్లు, తదితర వివరాలను పూర్తిగా తెలుసుకుందాం..
ఏడేళ్ల క్రితం ఇదేరోజున సీఆర్పీఎఫ్ కాన్వాయ్ జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారి గుండా వెళుతోంది. ఆ రోజు సీఆర్పీఎఫ్కు చెందిన 2,547 మంది సిబ్బంది 60కి పైగా వాహనాల్లో ప్రయాణిస్తున్నారు. సైనికులు ఉన్న ఈ కాన్వాయ్లో అధికంగా బస్సులు ఉన్నాయి. కాన్వాయ్ పుల్వామా వద్దకు చేరుకోగానే అటువైపు నుంచి వచ్చిన ఓ కారు కాన్వాయ్లోని ఓ బస్సును ఢీకొంది. బస్సును ఢీకొన్న ఆ కారులో పెద్ద ఎత్తున పేలుడు పదార్థాలు ఉన్నాయి. దీంతో వెంటనే పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు వీరమరణం పొందారు. అయితే.. ఈ దాడికి పాకిస్థాన్కు చెందిన ఉగ్రవాద సంస్థ జైష్-ఎ-మొహమ్మద్ బాధ్యత వహించింది. తామే చంపేశామని ప్రకటించింది. ఈ ఘటన భారతదేశాన్ని తీవ్రంగా కుదిపేసింది. దేశవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమైంది. అమాయకంగా విధులు నిర్వర్తిస్తున్న జవాన్లపై ఇలాంటి దాడి జరగడం అందరినీ కలిచివేసింది. పుల్వామాలో ఉగ్రదాడి అనంతరం భారత్.. పాకిస్థాన్కు తగిన గుణపాఠం చెప్పేందుకు కఠిన చర్యలు అవలంబించింది. ఫలితంగా పాకిస్తాన్కు తీవ్ర నష్టం వాటిల్లింది.
READ MORE: Ranveer Singh : సల్మాన్ తర్వాత ఇప్పుడు రణవీర్? గ్యాంగ్ వార్నింగ్తో వణికిపోతున్న బాలీవుడ్!
2019, ఫిబ్రవరి 26న భారత వైమానిక దళం పాకిస్థాన్లోని బాలాకోట్లోకి ప్రవేశించి వైమానిక దాడులతో పాక్లోని ఉగ్రవాదుల శిబిరాలను ధ్వంసం చేసింది. దీంతో ఫిబ్రవరి 27న పాకిస్థాన్ వైమానిక దళం జమ్మూ, కశ్మీర్లోకి చొరబడి భారతదేశంపై వైమానిక దాడులకు పాల్పడింది. దీనికి ప్రతిస్పందనగా భారత వైమానిక దళం దాడులు చేపట్టిన సమయంలో భారత్కు చెందిన యుద్ధ విమానం ‘మిగ్-21’ పాకిస్థాన్ సైన్యం దాడికి గురై, అక్కడే పడిపోయింది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ సైనికులు ‘మిగ్-21’ పైలట్ అభినందన్ వర్థమాన్ను పట్టుకున్నారు. 2019, మార్చి ఒకటిన అమెరికాతో పాటు ఇతర దేశాల ఒత్తిడి మేరకు పాకిస్థాన్ సైన్యం అభినందన్ వర్థమాన్ను విడుదల చేసింది. పుల్వామా ఉగ్రదాడి అనంతరం భారత్ అప్పటివరకూ పాక్తో ఉన్న అన్ని వాణిజ్య సంబంధాలను రద్దు చేసుకుంది. ఫలితంగా పాకిస్తాన్ ఆర్థికంగా తీవ్రంగా నష్టపోవాల్సి వచ్చింది. పాకిస్థాన్ను బ్లాక్లిస్ట్లో చేర్చేందుకు మనీలాండరింగ్పై ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (ఎఫ్ఏటీఎఫ్)ను కూడా భారత ప్రభుత్వం కోరింది.