వైజయంతి మూవీస్, స్వప్న సినిమాస్ బ్యానర్లపై నాగ్ అశ్విన్ నిర్మించిన లేటెస్ట్ మూవీ ‘సింగ్ గీతం’. 94 ఏళ్ల వయసులోనూ ఒక టీనేజర్లాంటి ఉత్సాహంతో లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కించిన ఈ సినిమాపై ఇండస్ట్రీలో భారీ అంచనాలు ఉన్నాయి. అయాన్, అహల్యా బమ్రూ, శాలిని కొండెపుడి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి రాక్స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించారు. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నిర్మాత నాగ్ అశ్విన్ విలేకర్లతో ముచ్చటిస్తూ పలు సంచలన విషయాలను పంచుకున్నారు.
ఈ సినిమా ప్రయాణం వెనుక ఒక అద్భుతమైన ఫ్లాష్బ్యాక్ ఉందని నాగ్ అశ్విన్ వెల్లడించారు. “గతంలో నేను కమల్ హాసన్ ని కలిసినప్పుడు ఒక షాకింగ్ విషయం చెప్పారు. సింగీతం క్లాసిక్ మూవీ ‘పుష్పక విమానం’ కంటే ముందే ఈ ‘సింగ్ గీతం’ కథను కమల్ గారికి వినిపించారట. కానీ అప్పట్లో ఉన్న కొన్ని ప్రాజెక్టుల వల్ల అది కుదరలేదు. ‘మహానటి’ సినిమా తర్వాత సింగీతం ఈ కథను నాకు చెప్పారు. ఇప్పటికీ ఈ కథ వింటే ఈ జనరేషన్ కోసం రాసిన కథలాగే అనిపిస్తుంది. ఆయన సినిమాలు ఎప్పుడూ టైమ్లెస్ గా ఉంటాయి” అని నాగ్ అశ్విన్ చెప్పుకొచ్చారు.
ఇది కేవలం ఒక ప్రయోగం మాత్రమే కాదు, మంచి వినోదాత్మక చిత్రం అని నాగ్ అశ్విన్ క్లారిటీ ఇచ్చారు. “ఇది ‘కుబేరపురం’ అనే ఒక ఊహాజనిత గ్రామంలో ఉండే గోల్డ్ మైన్స్ బ్యాక్డ్రాప్లో సాగే ఫిక్షనల్ స్టోరీ. ఆ ఊరికి, ఆ మైన్స్కు ఉన్న కనెక్షన్ ఏంటనేది సింగీతం సిగ్నేచర్ ట్రేడ్మార్క్ హ్యూమర్, హ్యూమానిటీతో అద్భుతంగా చూపించారు” అని తెలిపారు. “పెద్ద నటీనటులు ఉంటే వారి ఇమేజ్ ప్రభావం కథపై పడుతుంది. అందుకే కొత్త ప్రపంచాన్ని ప్రేక్షకులు సహజంగా ఫీల్ అవ్వడం కోసం సింగీతం స్వయంగా కొత్తవాళ్లను ఎంపిక చేశారు” అని అన్నారు.
ఈ సినిమాలో ఉన్న అతిపెద్ద ప్రయోగం ఏంటంటే.. ఇందులో సాధారణ డైలాగ్స్ ఉండవు, అన్నీ పాటల రూపంలోనే వస్తాయి. “ఇందులో మాటలన్నీ పాటల్లాగే సాగుతాయి. దేవిశ్రీ ప్రసాద్ ఎక్కడా నాన్స్టాప్ మ్యూజిక్ వింటున్నామనే ఫీలింగ్ రాకుండా చాలా సహజంగా, ఎంటర్టైనింగ్గా చేశారు. ఈ ప్రయోగం వల్లనే సినిమాను ఇతర భాషల్లోకి తీసుకెళ్లడం కొంచెం కష్టమైన ప్రక్రియగా మారింది. ప్రతి భాషలోనూ డైలాగ్స్ను మళ్లీ సంగీతబద్ధంగా రూపొందించాల్సి ఉంటుంది. ప్రస్తుతం తమిళంలో రిలీజ్ చేస్తున్నాం, మిగతా భాషల గురించి కూడా ఆలోచిస్తున్నాం” అని నాగ్ అశ్విన్ వివరించారు.

