Ponnam Prabhakar : రాజకీయాల్లో విమర్శలు, ప్రతివిమర్శలు సహజమని, అయితే అవి హుందాతనాన్ని కోల్పోకూడదని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. ఇటీవల కొంతమంది నాయకులు వ్యక్తిగత విమర్శలకు దిగడం వల్లే సమాజంలో అశాంతి నెలకొంటోందని, ఇటువంటి ధోరణి ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
నాయకులు తమ స్థాయిని మర్చిపోయి వ్యక్తిగత దూషణలకు దిగడం వల్లే ఉద్రిక్త పరిస్థితులు తలెత్తుతున్నాయని మంత్రి అభిప్రాయపడ్డారు. “ప్రజాప్రతినిధులు ప్రజల నమ్మకాన్ని నిలబెట్టే విధంగా వ్యవహరించాలి. చౌకబారు ప్రచారం కోసం దిగజారుడు మాటలు మాట్లాడటం సరికాదు. ఒకరి మాటల వల్ల ఎవరి మనసైనా నొచ్చుకుంటే, దానికి దీటుగా సమాధానం చెప్పాలే తప్ప, భౌతిక దాడులకు దిగడం పిరికిపంద చర్య” అని ఆయన వ్యాఖ్యానించారు.
ప్రజాప్రతినిధుల ఇళ్లపై మరో ప్రజాప్రతినిధికి చెందిన కార్యకర్తలు దాడులు చేయడం అప్రజాస్వామికమని మంత్రి పేర్కొన్నారు. నాయకులు ఎవరైనా సరే తమ కార్యకర్తలను అదుపులో ఉంచుకోవాలని ఆయన సూచించారు. “దాడులకు పాల్పడుతున్న కార్యకర్తలపై కఠినమైన క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి. అప్పుడే ఆయా నాయకులకు ప్రజాస్వామ్యంపై ఉన్న చిత్తశుద్ధి నిరూపించబడుతుంది” అని ఆయన స్పష్టం చేశారు.
ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకోబడిన ప్రతినిధులు రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాలని, ప్రజల్లో శాంతిభద్రతలకు భంగం కలిగించేలా ప్రవర్తించకూడదని మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ సందర్భంగా హితవు పలికారు. రాజకీయాలు కేవలం అధికార దాహం కోసం కాకుండా, ప్రజా సేవ కోసం ఉండాలని ఆయన ఆకాంక్షించారు.
