Amit Shah: మహిళా రిజర్వేషన్ల బిల్లు అమలులో ఎటువంటి జాప్యం లేదని, 2029 నాటికి మహిళలు పార్లమెంట్లో రిజర్వేషన్లతో అడుగుపెట్టడమే ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. లోక్సభలో ఈ బిల్లుపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ.. పరిసీమన, ఓటు విలువ, విపక్షాల వైఖరిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశవ్యాప్తంగా నియోజకవర్గాల మధ్య ఓటర్ల సంఖ్యలో భారీ వ్యత్యాసాలు ఉన్నాయని అమిత్ షా ఎత్తి చూపారు.
READ ALSO: Women Reservation: సారీ మహిళ.. లోక్సభలో వీగిపోయిన బిల్లు..
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “ప్రస్తుతం దేశంలో 127 నియోజకవర్గాల్లో 20 లక్షలకు పైగా ఓటర్లు ఉన్నారు. కొన్ని చోట్ల 45 లక్షల మందికి ఒక ఎంపీ ఉంటే, మరికొన్ని చోట్ల కేవలం 6 లక్షల మందికే ఒక ప్రతినిధి ఉన్నారు. దీనివల్ల ప్రతి ఓటుకు సమాన విలువ ఉండటం లేదు. ‘ఒక వ్యక్తి-ఒక ఓటు-ఒక విలువ’ అనే సిద్ధాంతం అమలవ్వాలంటే పరిసీమన తప్పనిసరి” అని ఆయన వివరించారు. 2026 తర్వాత జరిగే జనాభా గణన ఆధారంగా ఈ ప్రక్రియ పూర్తి చేసి, మహిళా కోటాను ఖరారు చేస్తామని తెలిపారు.
ఇందిరా గాంధీ నిర్ణయాన్ని గుర్తు చేస్తూ..
పరిసీమనను ఇప్పుడే ఎందుకు తెస్తున్నారన్న విపక్షాల ప్రశ్నకు అమిత్ షా సమాధానమిస్తూ.. 1971లో ఇందిరా గాంధీ ప్రభుత్వం సీట్ల సంఖ్యను ఫ్రీజ్ చేసిందని గుర్తు చేశారు. ఆనాటి నిర్ణయం వల్లే ఇప్పుడు మనం ఈ ప్రక్రియను అనుసరించాల్సి వస్తోందని, ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగానే ముందుకు వెళ్తోందని చెప్పారు. ఉత్తర-దక్షిణ భారత దేశాల మధ్య విభజన రేఖలు గీసే ప్రయత్నాలను సహించబోమని ఆయన ఇండీ కూటమిని హెచ్చరించారు. “ఇండీ (INDIA) కూటమి సభ్యులు మహిళా రిజర్వేషన్లను మనస్ఫూర్తిగా స్వాగతించడం లేదు. రాజకీయాల కోసం వారు మతం ఆధారంగా ముస్లిం రిజర్వేషన్లు అడుగుతున్నారు. రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్లో మతపరమైన రిజర్వేషన్లకు అవకాశం ఉందో చెప్పాలి” అని ఆయన నిలదీశారు. మహిళా సాధికారతపై విపక్షాలు కేవలం భ్రమలు కల్పిస్తున్నాయని మండిపడ్డారు.
