ఓటీటీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న పొలిటికల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ లలో మహారాణి వెబ్ సిరీస్ ఒకటి. బీహార్ రాజకీయాల చుట్టూ తిరిగే ఈ సిరీస్ తొలి రెండు సీజన్లు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి.1990 ల నాటి బీహార్ రాజకీయాలను కళ్లకు కడుతున్న ఈ సిరీస్ మూడో సీజన్ మార్చి 7 నుంచి సోనీ లివ్ ఓటీటీ లో స్ట్రీమింగ్ కానుంది. తాజాగా సోమవారం (ఫిబ్రవరి 19) రాత్రి ఈ సిరీస్ ట్రైలర్ రిలీజైంది.బీహార్ రాజకీయాలు ఎంత క్రూరంగా ఉంటాయో ఈ మహారాణి వెబ్ సిరీస్ తొలి రెండు సీజన్లతోనే చూపించింది. ఈ మూడో సీజన్లో ఈ పొలిటికల్ వార్ మరింత తీవ్రం కానున్నట్లు తెలుస్తుంది.. రెండో సీజన్ చివర్లో జైలుకి వెళ్లే రాణీ భారతి.. తిరిగి కొత్త బీహార్ లో అడుగు పెట్టి మళ్లీ కోల్పోయిన అధికారాన్ని చేజిక్కించుకుంటుందా లేదా అన్నది మూడో సీజన్ లో చూపించనున్నారు.
రాణీ భారతి పాత్ర లో అదరగొట్టిన బాలీవుడ్ నటి హుమా ఖురేషీ ఇప్పుడు మూడో సీజన్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తోంది. తాజాగా రిలీజ్ అయిన ట్రైలర్ ఆకట్టుకుంటుంది.ట్రైలర్ చూస్తేనే మహారాణి మూడో సీజన్ ఎంత ఇంటెన్సివ్ గా ఉండబోతోందో అర్ధం అవుతుంది.ఆగస్ట్, 2022 లో రెండో సీజన్ రాగా ఏడాదిన్నర తర్వాత మూడో సీజన్ తో మహారాణి రాబోతోంది. దీంతో ఈ సిరీస్ పై ఎంతో ఆసక్తి నెలకొంది.ఈ మహారాణి వెబ్ సిరీస్ ను సుభాష్ కపూర్ క్రియేట్ చేయగా సౌరభ్ భావే డైరెక్ట్ చేశాడు. నందన్ సింగ్ మరియు ఉమాశంకర్ సింగ్ లతో కలిసి సుభాష్ కపూర్ ఈ సిరీస్ కు కథ ను అందించాడు. మహారాణి మూడో సీజన్ మార్చి 7 నుంచి సోనీ లివ్ ఓటీటీ లో స్ట్రీమింగ్ కి రానుంది.