టాలీవుడ్ స్టార్ కపుల్ విజయ్ దేవరకొండ మరియు రష్మిక మందన్న వివాహం మరికొన్ని గంటల్లో రాజస్థాన్లోని ఉదయ్పూర్ వేదికగా జరగనుంది. ఈ క్రమంలో ఈ జంటకు ఒక అరుదైన గౌరవం దక్కింది. భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్వయంగా ఈ నూతన వధూవరులకు తన ఆశీస్సులు మరియు శుభాకాంక్షలు తెలియజేశారు.
Also Read : Rajni 173 : రజనీకాంత్ కొడుకుగా మలయాళ స్టార్ హీరో..
విజయ్ దేవరకొండ తల్లిదండ్రులు పంపిన వివాహ ఆహ్వాన పత్రికకు స్పందించిన ప్రధాని మోదీ, ఒక ప్రత్యేక సందేశాన్ని పంపారు. “విజయ్ మరియు రష్మికల జీవితంలో ఇది ఒక అందమైన కొత్త అధ్యాయానికి నాంది. ‘సప్తపది’ అనే పవిత్ర సంప్రదాయంతో ఏడడుగులు వేస్తూ జీవితాంతం స్నేహితులుగా, తోడుగా ఉండాలని ఆకాంక్షిస్తున్నాను” అని మోదీ తన సందేశంలో పేర్కొన్నారు. దేవరకొండ మరియు మందన్న కుటుంబాలకు కూడా ఆయన అభినందనలు తెలిపారు. ఉదయ్పూర్లోని ఐటీసీ మెమెంటోస్ హోటల్లో ఈ వేడుకలు అట్టహాసంగా జరుగుతున్నాయి. ఇప్పటికే మెహందీ, సంగీత్ కార్యక్రమాలు ముగిశాయి. ‘విరోష్’ (VIROSH) పేరుతో పిలవబడే ఈ జంట తమ ప్రేమ ప్రయాణాన్ని ఫోటో గ్యాలరీ రూపంలో సంగీత్ వేదిక వద్ద ప్రదర్శించారు. కేవలం 50 మంది సన్నిహితుల మధ్య గురువారం ఉదయం తెలుగు సంప్రదాయంలో, సాయంత్రం కొడవ (కుర్గ్) సంప్రదాయంలో ఈ వివాహం జరగనుంది. మార్చి 4న హైదరాబాద్లోని తాజ్ కృష్ణలో జరగబోయే గ్రాండ్ రిసెప్షన్కు సినీ, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులు హాజరుకానున్నారు. ప్రధాని మోదీ పంపిన ఈ లేఖ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.