G20 Summit: జీ20 కూటమిలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆఫ్రికన్ యూనియన్ శనివారం జీ20లో శాశ్వత సభ్యత్వం పొందింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రతిపాదించిన ప్రతిపాదనను అన్ని సభ్య దేశాలు స్వాగతించాయి. స్వాగతించారు. నేడు భారత్ మండపంలో జరిగిన వన్ ఎర్త్ సెషన్ ప్రారంభోపన్యాసంలో ప్రధాని నరేంద్ర మోదీ ఈ విషయాన్ని ప్రతిపాదించగా.. అందరు సభ్యుల అంగీకారంతో ఆఫ్రికన్ యూనియన్కు శాశ్వత సభ్యత్వం ఇస్తున్నట్లు ప్రకటించారు. ఆ తర్వాత ప్రధాని మోడీ యూనియన్ ఆఫ్ కొమొరోస్ ప్రెసిడెంట్, ఆఫ్రికన్ యూనియన్ (AU) ఛైర్పర్సన్ అజాలి అసోమానిని జీ20 హై టేబుల్లో కూర్చోవాలని ఆహ్వానించారు. ఆనందోత్సాహాలు, చప్పట్ల మధ్య, విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ అసోమానీని తన సీటుకు తీసుకెళ్లారు. ఆ తర్వాత ప్రధాని మోడీ, అసోమానీ ఆప్యాయంగా కౌగిలించుకున్నారు.
Also Read: G20 Summit Live Updates: గ్లోబల్ బయోఫ్యూయల్స్ అలయన్స్ను ప్రారంభించిన ప్రధాని మోడీ
“మీ అందరి మద్దతుతో ఆఫ్రికన్ యూనియన్ను G20లో చేరాలని ఆహ్వానిస్తున్నాను” అని G20 సమ్మిట్లో ప్రధాని మోడీ అన్నారు. గ్లోబల్ సౌత్లోని ఈ కీలక కూటమిని ప్రపంచంలోని అగ్రశ్రేణి ఆర్థిక వ్యవస్థల ఎలైట్ గ్రూప్కి తీసుకురావాలనే ప్రతిపాదనకు మంచి స్పందన లభించింది. దీంతో 55 దేశాల ఆఫ్రికన్ యూనియన్ జీ20లో శాశ్వత సభ్యత్వం పొందింది. ఆఫ్రికన్ యూనియన్ జీ20 సభ్యత్వం కోసం భారత్ చాలా కాలంగా ఒత్తిడి చేస్తోంది. ఈ ఏడాది జూన్లో ఆఫ్రికన్ యూనియన్ను గ్రూపింగ్లో శాశ్వత సభ్యుడిగా చేయాలని కోరుతూ ప్రధాని మోదీ జీ20 నేతలకు లేఖ రాశారు. ఆఫ్రికన్ యూనియన్ అనేది ఆఫ్రికన్ ఖండంలోని దేశాలను రూపొందించే 55 సభ్య దేశాలతో కూడిన ప్రభావవంతమైన సంస్థ. దాదాపు 130 కోట్ల జనాభా కలిగిన ఏయూ ఇందులో చేరడంతో జీ20 కూటమి ప్రపంచానికి మరింత చేరువైనట్లైంది. జీ20 కూటమిలో ఇప్పటి వరకు ఏయూ నుంచి కేవలం ఒక్క దక్షిణాఫ్రికా మాత్రమే సభ్యదేశంగా ఉంది. కానీ, ఇప్పుడు భారత్ చొరవ, సభ్యదేశాల అంగీకారంతో ఆఫ్రికన్ యూనియన్ శాశ్వత సభ్యత్వాన్ని పొందింది.
Also Read: G20 Summit: జీవ ఇంధనంపై ప్రపంచ కూటమి ఏర్పాటు.. ప్రధాని మోడీ కీలక ప్రకటన
జీ20లో ఏయూ చేరడమనేది ఇటు కూటమితో పాటు ఆఫ్రికాకు కూడా చాలా ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అగ్ర దేశాలు ఎన్నో ఆఫ్రికాలో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపుతున్నాయి. చైనా ఇప్పటికే ఆఫ్రికాకు అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉండడంతో పాటు భారీ స్థాయిలో రుణాలు ఇచ్చే దేశంగా కూడా ఉంది. రష్యా కూడా ఇక్కడి దేశాలకు ప్రధాన ఆయుధ సరఫరాదారుగా ఉంది. గల్ఫ్ దేశాలూ అక్కడ భారీ స్థాయిలో పెట్టుబడులు పెడుతున్నాయి. ఇతర యూరప్ దేశాలు కూడా పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాయి. కూటమికి కూడా చాలా లాభాలున్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద స్వేచ్ఛా వాణిజ్యానికి కేంద్రంగా మారనుంది. ఆఫ్రికాలో ప్రపంచానికి అవసరమైన వనరులు పుష్కలంగా ఉన్నాయి. ప్రపంచంలో 60శాతం పునరుత్పాదక శక్తి వనరులు ఆఫ్రికా ఖండంలోనే ఉండడం గమనార్హం. ఖనిజాలకు కూడా ఆఫ్రికా నిలయంగా ఉంది. లిథియం-అయాన్ బ్యాటరీల తయారీలో కోబాల్ట్ కీలక ఖనిజం. ప్రపంచవ్యాప్తంగా లభించే కోబాల్ట్లో సగానికి పైగా కాంగో(డీఆర్సీ)లోనే ఉన్నట్లు ఇటీవల వెల్లడించిన నివేదికలో ఐక్యరాజ్యసమితి వెల్లడించింది. ఇలా ఆఫ్రికాలోని వనరులను ఉపయోగించుకుని కొన్ని దేశాలు లాభాలు పొందుతున్నాయనే వాదన కూడా ఉంది.