PM Modi Visits Srisailam Temple: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శ్రీశైలంకు చేరుకున్నారు. ఉదయం ఢిల్లీ నుంచి కర్నూలు చేరుకున్న ప్రధానికి గవర్నర్ నజీర్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వాగతం పలికారు. అనంతరం సైనిక హెలికాఫ్టర్లో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు శ్రీ శైలంకు చేరుకున్నారు. అక్కడ శ్రీశైలం భ్రమరాంబ అతిథి గృహానికి విచ్చేశారు. కాసేపట్లో శ్రీ భ్రమరాంబా సమేత మల్లికార్జున స్వామివారికి ప్రత్యేక పూజలు చేస్తారు. 12:10 నుంచి 12:35 వరకు శివాజీ స్ఫూర్తి కేంద్రం సందర్శించుకుంటారు. 12:40 కి తిరిగి భ్రమరాంబ అతిథి గృహానికి వస్తారు. మధ్యాహ్నం 1:20కి భ్రమరాంబ అతిథి గృహం నుంచి బయల్దేరి సుండిపెంట హెలిప్యాడ్ కు చేరుకుని కర్నూలు బైల్దేరుతారు. మధ్యాహ్నం 2.20కి కర్నూలు హెలిపాడ్ చేరుకుంటారు. 2.30 కి నన్నూరు సమీపంలోని రాగమయూరి వెంచర్ లో సభస్థలికి చేరుకోనున్నారు.
READ MORE: Team India: జట్టు నుంచి గెంటేశారు.. కట్ చేస్తే సెంచరీతో దుమ్ములేపాడు!
మరోవైపు.. ఉమ్మడి కర్నూలు జిల్లా నన్నూరు సమీపంలో “సూపర్ జీఎస్టీ – సూపర్ సేవింగ్స్” పేరుతో ప్రధాని మోడీ భారీ బహిరంగసభ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. 3 లక్షల మందితో సూపర్ జీఎస్టీ సభ ఏర్పాటు చేశారు. 400 ఎకరాల్లో సభ ఏర్పాట్లు చేపట్టారు. 360 ఎకరాల్లో 12 పార్కింగ్ ప్రదేశాలు, 50 ఎకరాల్లో సభా ప్రాంగణం, వేదిక ఉండనుంది. జన సమీకరణకు దాదాపుగా 7వేల బస్సులు ఏర్పాటు చేశారు. ఈ సభను ఉద్దేశించి ప్రధాని ప్రసంగించనున్నారు. రూ.13,430 కోట్లతో 16 ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు. రూ.2,280 కోట్లతో విద్యుత్ ప్రసార వ్యవస్థ, రూ.4920 కోట్లతో పారిశ్రామిక అభివృద్ధి, రూ. 1200 కోట్లతో రైల్వే ప్రాజెక్టులు, గెయిల్ ఇండియా లిమిటెడ్ కు చెందిన రూ. 1730 కోట్లతో శ్రీకాకుళం – అంగుల్ జాతీయ గ్యాస్ పైప్ లైన్, కర్నూలు పిఎస్ – 3 వద్ద పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టుల కోసం రూ.2,886 కోట్లతో అదనపు పవర్ గ్రేడ్ నిర్మాణానికి శంకుస్థాపనలు చేస్తారు
