PM Modi Road Show In Vijayawada: విజయవాడ బందర్ రోడ్డులో ప్రధాని నరేంద్ర మోడీ రోడ్ షో ముగిసింది.. గంట పాటు బందర్ రోడ్డులో రోడ్ షో నిర్వహించారు ప్రధాని మోడీ.. ఈ రోడ్ షోలో వాహనంపై ప్రధాని మోడీకి ఓ వైపు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. మరోవైపు జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ నిలబడి.. దారిపొడవునా.. ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు.. ప్రధాని మోడీ రోడ్ షో.. బీజేపీ-టీడీపీ-జనసేన కూటమిలో కొత్త జోష్ నింపిందని కూటమి నేతలు చెబుతున్నారు.. ఇక, రోడ్ షో అనంతరం బెంజ్ సర్కిల్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన టెంటులోకి వెళ్లారు ప్రధాని మోడీ, చంద్రబాబు, పవన్ కల్యాణ్.. ఆంధ్రప్రదేశ్లో తాజా రాజకీయ పరిణామాలు, ఎన్నికల సరళిపై చంద్రబాబు-పవన్ కల్యాణ్తో మోడీ మంతనాలు జరిపారు.. ఐదారు నిమిషాల పాటు చంద్రబాబు, పవన్తో మోడీ చిట్ చాట్ జరిగింది.. ఈ భేటీలో తాజాగా జరిగిన పరిణామాలను ప్రధాని మోడీ దృష్టికి తీసుకెళ్లారట ఇద్దరు నేతలు.. ప్రచారసరళి.. ప్రజల నుంచి వస్తున్న స్పందన.. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల తీరు సహా.. కీలక విషయాలపై ప్రత్యేకంగా మోడీతో చర్చించినట్టుగా తెలుస్తోంది.
Read Also: Wine Shops closed: మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. 48 గంటల పాటు మద్యం దుకాణాలు బంద్..
ఇక, అంతకు ముందు బహిరంగ సభలో ప్రధాని మోడీ మాట్లాడుతూ.. రాయలసీమలో దేనికీ లోటు లేదన్నారు ప్రధాని మోడీ. ఖనిజాలు, వనరులు, దివ్యమైన ఆలయాలు, కష్టపడి పనిచేసే రైతులు, నైపుణ్యం ఉన్న యువత ఉందన్నారు. టూరిజానికి కూడా అపార అవకాశాలున్నాయని చెప్పారు. రాయలసీమ అభివృద్ధే తన లక్ష్యమని మోడీ చెప్పారు. రాయలసీమ ప్రజలు దశాబ్దాలుగా ఇతర పార్టీని ఆదరించినా… ఎలాంటి అభివృద్ధి జరలేదన్నారు. ఇరిగేషన్ వ్యవస్థ లేదు. పరిశ్రమలు లేవు. రైతులు ఆందోళనలో ఉన్నారు. యువత పని కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తుంది. ఈ పరిస్థితి మారాలా వద్దా..? అని ప్రశ్నించారు మోడీ. మారాలంటే ఆంధ్రప్రదేశ్లో కూడా డబుల్ ఇంజిన్ ప్రభుత్వం రావాలన్నారు. వైసీపీ ప్రభుత్వానికి కౌంట్డౌన్ మొదలైందన్నారు ప్రధాని మోడీ. రాజంపేట ప్రాంతంలో వైసీపీ మంత్రి రౌడీ రాజ్యం నడుపుతున్నారని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం మాఫియాను పెంచి పోషిస్తోందన్నారు. శాండ్ మాఫియా కారణంగా అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోయిందన్నారు. నీటి పారుదల వ్యవస్థపై వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని ఆరోపించారు మోడీ. జలజీవన్ మిషన్కు వైసీపీ ప్రభుత్వం సహకరించడంలేదన్నారు. పోలవరం ప్రాజెక్టును ఏం చేశారో అందరికీ తెలుసన్నారు. బలమైన ప్రభుత్వం ఉంటే అభివృద్ధి వేగంగా జరుగుతుందన్నారు మోడీ. ప్రపంచ దేశాల్లో భారత్ ప్రతిష్ట పెరిగిందన్నారు. గల్ఫ్ దేశాల్లో భారతీయుల పట్ల గౌరవం పెరిగిందన్నారు. ఖతార్లో ఉరిశిక్ష పడినవారి సురక్షితంగా తీసుకురాగలిగామన్నారు మోడీ.. దేశాన్ని రివర్స్ గేర్లో తీసుకెళ్లేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని మోడీ ఆరోపించారు. ఆర్టికల్ 370ని మళ్లీ తీసుకురావాలనుకుంటోందని… అయోధ్యలో రామ మందిరానికి తాళం వేయాలనుకుంటోందని ఆరోపించారు. గత పదేళ్లలో చేసిన పనులన్నింటిని కాంగ్రెస్ రద్దు చేస్తామంటోందని ప్రధాని నరేంద్ర మోడీ మండిపడిన విషయం విదితమే.