Vaibhav Sooryavanshi: భారత క్రికెట్లో సంచలనంగా మారిన 15 ఏళ్ల బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ మరోసారి వార్తల్లో నిలిచాడు. బీహార్కు చెందిన ఈ యంగ్ క్రికెటర్ జూన్ 26 నుంచి ప్రారంభమయ్యే ఐర్లాండ్ టీ20 సిరీస్ ద్వారా భారత జట్టుకు అరంగేట్రం చేయనున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ గా మారాయి.
గత ఐపీఎల్ 2026 సీజన్లో రాజస్థాన్ రాయల్స్ తరఫున అద్భుత ప్రదర్శన చేసిన వైభవ్ సూర్యవంశీ అనేక రికార్డులను బద్దలు కొట్టాడు. దూకుడైన బ్యాటింగ్తో అందరి దృష్టిని ఆకర్షించిన అతడు.. చాలా తక్కువ సమయంలోనే జాతీయ జట్టులో చోటు సంపాదించుకున్నాడు. కేవలం రెండు సంవత్సరాల క్రితం దేశీయ క్రికెట్లో కూడా పెద్దగా గుర్తింపు లేని స్థాయి నుంచి 15 ఏళ్ల వయసులోనే ఇప్పుడు భారత జట్టుకు ఎంపిక కావడం విశేషం. ఐర్లాండ్తో జరగనున్న టీ20 సిరీస్లో వైభవ్ సూర్యవంశీ భారత జట్టు తరఫున అరంగేట్రం చేయనున్నాడు. అభిషేక్ శర్మతో కలిసి ఇన్నింగ్స్ ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. శ్రీలంకలో జరిగిన ఇండియా-A ట్రై సిరీస్ ఫైనల్లో కూడా అద్భుత ఇన్నింగ్స్ ఆడి “మ్యాన్ అఫ్ ది మ్యాచ్” అవార్డు అందుకున్న సంగతి తెలిసిందే.
ఇదిలా ఉండగా.. న్యూఢిల్లీలో నిర్వహించిన రిపబ్లిక్ సమ్మిట్ 2026 కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోదీ వైభవ్ సూర్యవంశీని ఉదాహరణగా ప్రస్తావించారు. దేశ ఆర్థిక మార్పులు, జాతీయ భద్రత వంటి అంశాలపై మాట్లాడుతున్న సమయంలో యువత వేగంగా నిర్ణయాలు తీసుకునే తీరును వివరిస్తూ వైభవ్ పేరును ప్రధాని ప్రస్తావించారు. “దేశ యువత ఈ విషయాలను త్వరగా అర్థం చేసుకోవాలని పేర్కొన్నారు. ఒకవేళ అర్థం కాకపోతే వైభవ్ సూర్యవంశీ ఉన్నాడు కదా.. అతడు చాలా వేగంగా విషయాలను నేర్చుకునే శైలిని చూపిస్తున్నాడు” అని.. అతడిని చూసి యువత, GEN Z పిల్లలు నేర్చుకోవాలని మోదీ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. ప్రస్తుతం భారత జట్టు ఐర్లాండ్ చేరుకోగా.. వైభవ్ సూర్యవంశీ కూడా జట్టుతో కలిసి పర్యటిస్తున్నాడు. జూన్ 26న బెల్ఫాస్ట్లో జరిగే తొలి టీ20 మ్యాచ్లో అతడు టీమిండియా తరపున మ్యాచ్ ఆడనున్నారు.

