PM Convoy: ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్ పర్యటనలో ఆసక్తికరమైన ఘటన చోటుచేసుకుంది. ఆయన వెళ్తున్న మార్గంలో అంబులెన్స్ ను దారి ఇవ్వడం కోసం తన కాన్వాయిని కాసేపు నిలివేశారు. మోదీ అహ్మదాబాద్ నుంచి గాంధీనగర్ వెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అంబులెన్స్ తన కాన్వాయ్ను దాటిన తర్వాతే మోదీ తన కాన్వాయ్ను ముందుకు కదిలించారు. దీనికి సంబంధించిన వీడియోను గుజరాత్ బీజేపీ మీడియా విభాగం ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. అహ్మదాబాద్-గాంధీనగర్ మార్గంలో ప్రధాని కాన్వాయ్లోని ఎస్యూవీలు నెమ్మదిగా ఎడమవైపునకు వెళ్లి అంబులెన్స్కు దారి ఇస్తున్నట్టు వీడియోలో కనిపిస్తోంది.
శుక్రవారం మధ్యాహ్నం అహ్మదాబాద్లోని దూరదర్శన్ కేంద్రం వద్ద నిర్వహించిన బహిరంగ సభలో ప్రధాని పాల్గొన్నారు. అనంతరం గాంధీనగర్లోని రాజ్భవన్కు తిరిగి వెళ్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. రెండో రోజు పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్లో పలు ప్రాజెక్టులను ప్రారంభించారు. అహ్మదాబాద్ మెట్రో ప్రాజెక్ట్ తొలి దశతో పాటు గాంధీనగర్-ముంబయి మధ్య వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలుకు పచ్చజెండా ఊపారు. ఈ రోజు సాయంత్రం బనస్కాంత జిల్లాలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. అలాగే, అక్కడ ప్రముఖ అంబాజీ ఆలయంలో నిర్వహించే ప్రత్యేక పూజల్లో ఆయన పాల్గొంటారు.
గాంధీనగర్-ముంబయి మధ్య వందే భారత్ హైస్పీడ్ రైలును మోదీ ప్రారంభించారు. అనంతరం కాసేపు అందులో ప్రధాని ప్రయాణించారు. రైలులో ఏర్పాట్లను పరిశీలించారు. ఇక, ఈ రైలు అక్టోబరు 1 నుంచి అందుబాటులోకి రానుంది. ఆదివారం మినహా వారంలో ఆరు రోజులు నడవనుంది. ఈ మార్గంలో టికెట్ కనిష్ఠ ధర రూ.1385, గరిష్ఠ ధర రూ. 2505గా ఉంది. కాగా.. దేశంలో ఇది మూడో వందే భారత్ రైలు. 2019లో తొలి వందే భారత్ రైలు దేశంలో అందుబాటులోకి వచ్చింది. న్యూఢిల్లీ – వారణాసి మార్గంలో హైస్పీడ్ రైలు ప్రారంభించగా.. న్యూఢిల్లీ – శ్రీ మాతా వైష్ణోదేవి మార్గంలో రెండో రైలును ప్రవేశపెట్టారు.