kejriwal: రెండు రాష్ట్రాల్లో అధికారం చేజిక్కించుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ తాజాగా మూడో రాష్ట్రంలో పాగా వేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఢిల్లీ, పంజాబులతో పాటు గుజరాత్ రాష్ట్రంలో ఎలాగైనా గెలిచి తీరాలని ఆప్ అధ్యక్షుడు కేజ్రీవాల్ ప్రయత్నిస్తున్నారు. ఈ ఏడాది చివరి నాటికి గుజరాత్ అసెంబ్లీ పదవీకాలం ముగియనుంది. దీంతో అక్కడ మరో రెండు నెలల్లో ఎన్నికలు జరిగే అవకాశం ఉండటంతో ప్రధానమంత్రి నరేంద్రమోదీ సొంత రాష్ట్రం గుజరాత్ లో పాగా వేసేందుకు కేజ్రీవాల్ తనదైన వ్యూహాలతో ముందుకెళ్తున్నారు. ప్రతి నెలలో ఖచ్చితంగా వీలైనన్ని ఎక్కువసార్లు గుజరాత్ లో పర్యటిస్తున్నారు. అక్కడి గ్రామీణ ప్రజలను ఆకట్టుకోవడం కోసం అనేక హామీల వర్షం కురిపిస్తున్నారు.
Reas also: Gandhi Jayanti: జాతిపిత గాంధీకి భారతావని ఘన నివాళి
ఈ క్రమంలో గుజరాత్ పర్యటనకు వచ్చిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్పై ఓ వ్యక్తి నీళ్ల బాటిల్తో దాడికి యత్నించాడు. కేజ్రీవాల్ను లక్ష్యంగా చేసుకుని వెనక నుంచి విసిరిన వాటర్ బాటిల్ ఆయనను దాటుకుని వెళ్లిపడింది. అయితే, ఈ విషయాన్ని కేజ్రీవాల్ పట్టించుకోలేదు. వేదికపై ఉన్న కేజ్రీవాల్ ప్రజలకు అభివాదం తెలుపుతున్న సమయంలో వెనక నుంచి ఆయన వైపుగా ఓ వాటర్ బాటిల్ దూసుకొచ్చింది. అయితే, అది ఆయనను దాటుకుని వెళ్లి పడింది. కేజ్రీవాల్ వైపుగా దూసుకొస్తున్న వాటర్ బాటిల్కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటనపై ఆమ్ ఆద్మీ పార్టీ పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. గుజరాత్లో కేజ్రీవాల్ ఇస్తున్న హామీలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. తాము అధికారంలోకి వస్తే గుజరాత్లోని 33 జిల్లాల్లోనూ ప్రభుత్వ ఆసుపత్రులు నిర్మించి ఉచితంగా నాణ్యమైన చికిత్స అందిస్తామని కేజ్రీవాల్ హామీ ఇచ్చారు.
Read also: National Games 2022: జాతీయ క్రీడల్లో తెలుగు అథ్లెట్ల జోరు
ఇప్పటికే గృహ విద్యుత్తు వినియోగదారులకు 300 యూనిట్ల వరకు ఎటువంటి బిల్లు కట్టాల్సిన అవసరం లేదని హామీ ఇచ్చారు. తాము అధికారంలోకి రాగానే గుజరాత్లోని ప్రతి గ్రామంలో పాఠశాలలు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. పిల్లల భవిష్యత్ కోసం ఒక్కసారి ఆమ్ ఆద్మీ పార్టీకి అవకాశం ఇవ్వండి అంటూ గుజరాత్ ప్రజలను కోరారు అరవింద్ కేజ్రీవాల్. ఈ ఏడాది చివర్లో జరిగే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బీజేపీ కూడా అభివృద్ధి కార్యక్రమాలపై ఫోకస్ పెట్టింది. ప్రధాని మోదీ, అమిత్ షాల సొంత రాష్ట్రం కావడంతో గుజరాత్ ఎన్నికలు వీరిద్దరికి ఎంతో ప్రతిష్టాత్మకంగా మారతాయి. ఇక్కడి గెలుపు, ఓటములు జాతీయ స్థాయిలోనూ ప్రభావం చూపించే అవకాశం ఉంది.