వాహనదారులకు కేంద్రం షాక్ ఇవ్వబోతుందా? పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు భారీగా పెరగబోతున్నాయా? అంటే అవుననే సమాధానం ఇస్తోంది. ఆదివారం హైదరాబాద్లో జరిగిన సభలో ప్రధాని మోడీ ఇప్పటికే హింట్ ఇచ్చారు. ఇంధనం, విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేసేందుకు పెట్రోల్, డీజిల్ వాడకాన్ని తగ్గించుకోవాలని, ప్రజా రవాణాను, కార్ పూలింగ్ను ఉపయోగించుకోవాలని ప్రధాని మోడీ భారత పౌరులకు విజ్ఞప్తి చేశారు. వర్క్ ఫ్రమ్ హోం, ఆన్లైన్ మీటింగ్స్ పెట్టుకోవాలని, ఎలక్ట్రిక్ వాహనాలను ఉపయోగించుకోవాలని, కార్ల వినియోగం తగ్గించుకుని మెట్రో వంటి పబ్లిక్ రవాణా వ్యవస్థల్ని వాడుకోవాలని సూచించారు.
మోడీ వ్యాఖ్యల నేపథ్యంలో దేశ ప్రజలకు ఇప్పటికే అర్థమైపోయింది. పెట్రోల్, డీజిల్, గ్యా్స్ ధరలు పెరగబోతున్నాయని బలుబు వెలిగిపోయింది. ఇక పశ్చిమాసియా యుద్ధం కారణంగా చమురు, గ్యాస్ సంక్షోభం తలెత్తింది. దీంతో ఆయిల్ సంస్థలకు రోజుకు వెయ్యి కోట్ల నష్టం వాటిల్లుతోంది. ఇప్పటికే లక్షల కోట్లు నష్టం వాటిల్లింది. దీంతో ధరలు పెంచాలని కేంద్రాన్ని ఒత్తిడి చేస్తున్నాయి. మంత్రిత్వ శాఖల మధ్య చర్చల నేపథ్యంలో ఇంధన ధరల పెంపు భారీగా ఉండొచ్చని వార్తలు వస్తున్నాయి.
అమెరికా-ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలతో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు భారీగా పెరగడంతో ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు (OMCs) తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇంధన ధరల పెంపుపై ఆలోచనలు ప్రారంభించింది. ప్రస్తుతం ఈ త్రైమాసికంలో ఆయిల్ కంపెనీల అండర్ రికవరీలు రూ.2 లక్షల కోట్లకు చేరే అవకాశం ఉందని.. అందులో సుమారు రూ.1 లక్ష కోట్ల నష్టం వచ్చే అవకాశముందని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెంచక తప్పదని ఓ నిర్ణయానికి వచ్చేసింది.
సోమవారం సాయంత్రానికల్లా చమురు ధరలు పెరగవచ్చని వర్గాల నుంచి వార్తలొస్తున్నాయి. ఆర్థిక, పెట్రోలియం మంత్రిత్వ శాఖలు, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల (OMCలు) మధ్య చర్చలు కొనసాగుతున్నాయి. ఈ పెంపు సమయం.. ప్రపంచ ముడి చమురు పోకడలు, ద్రవ్యోల్బణం, ఆర్థిక ఒత్తిళ్లు, ఇంధన ధరలను సమతుల్యం చేయడానికి ప్రభుత్వం తీసుకునే విధానంపై ఆధారపడి ఉంటుందని వర్గాలు తెలిపాయి.
పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలు ముడి చమురు, గ్యాస్, ఎల్పీజీలను అధిక ధరకు కొనుగోలు చేస్తున్నప్పటికీ, వినియోగదారులను ఆదుకునేందుకు తుది ఉత్పత్తులను తక్కువ ధరకు అమ్ముతున్నాయని.. దీనివల్ల రోజుకు రూ. 1,000 కోట్ల వరకు నష్టాలు వస్తున్నాయని పెట్రోలియం, సహజ వాయువుల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి అన్నారు. పెరుగుతున్న నష్టాలను పూడ్చుకోవడానికి ప్రభుత్వ రంగ ఇంధన విక్రయ సంస్థలు పెట్రోల్, డీజిల్ ధరలను పెంచే అవకాశం ఉందని అధికారిక వర్గాలు తెలిపాయి.
