ఏపీలో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. వైసీపీ నేతలు నియోజకవర్గాల వారీగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నేడు శ్రీ సత్యసాయి జిల్లాలోని గాండ్లపెంట, కదిరి రూరల్, తనకల్లు మండలాల్లో ఇంఛార్జ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ.. మంచి చేశారు కాబట్టే తనకు ఓటు వేయాలని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అడుగుతున్నారన్నారు. చంద్రబాబు ఐదేళ్లు రాజధాని పేరుతో వృధా చేసి, లోపభూయిష్టంగా నాలుగు భవనాలు కట్టారని ఆయన ఆరోపించారు. త్కాలిక రాజధాని పేరుతో ప్రజాధనాన్ని, విలువైన ఐదేళ్ల సమయాన్ని వృధా చేశారని ఆయన మండిడపడ్డారు.
2014లో ఇచ్చిన ఎన్నికల హామీలు ఒక్కటీ చంద్రబాబు అమలు చేయలేదన్నారు. చంద్రబాబు హయాంలో జన్మభూమి కమిటీలు టిడిపి వారికి మాత్రమే పథకాలు అందించారని, పేదరికాన్ని మాత్రమే కొలమానంగా తీసుకుని పథకాలు అందించిన ఘనత సిఎం వైఎస్ జగన్ సొంతమన్నారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. జగన్ మరోసారి అధికారంలోకి వస్తే మరింత సుపరిపాలన అందిస్తారని ఆయన వ్యాఖ్యానించారు. చంద్రబాబు నాయుడు భవిష్యత్తు కే గ్యారెంటీ లేక పొత్తులు పెట్టుకున్నాడు అని మండిపడ్డారు. భవిష్యత్తు లేని చంద్రబాబు ప్రజల భవిష్యత్తుకు గ్యారంటీ ఇస్తారట.. తెలంగాణలో ఓటుకు నోట్లు స్కాంలో దొరికిపోయి.. పదేళ్లు ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్ ను వదిలి రాత్రికి రాత్రే పారిపోయి ఆంధ్రకు వచ్చారు అంటూ ఆయన విమర్శలు గుప్పించారు.