Pawan Kalyan Letter to PM Modi: ప్రధాని నరేంద్ర మోడీకి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లేఖ రాశారు.. పేదలందరికీ ఇళ్ల పట్టాల పథకం పేరుతో వైసీపీ ప్రభుత్వం భారీ స్కాంకు పాల్పడ్డారని ప్రధానికి లేఖ ద్వారా ఫిర్యాదు చేశారు.. పేదలందరికీ భూమి పేరుతో వైసీపీ ప్రభుత్వం భారీ కుంభకోణానికి పాల్పడిందని.. ఈ స్కీం కింద భారీ ఎత్తున.. రూ. 35,141 కోట్ల మేర దోపిడీ జరిగిందన్నారు. పేదలందరికీ ఇళ్ల పట్టాల పేరుతో జరిగిన దోపిడీపై సీబీఐ, ఈడీలతో విచారణ జరిపించాలి. ఈ స్కీం కేంద్ర ప్రభుత్వ పథకాలతో ముడిపడి ఉన్న అంశం కాబట్టి సీబీఐ, ఈడీలతో విచారణ చేయించాలన్నారు. భూ సేకరణ పేరుతో భారీ దందాకు.. భారీ దోపిడీకి వైసీపీ నేతలు తెర లేపారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో గృహ నిర్మాణాల్లో జరిగిన అత్యంత భారీ అవినీతిపై దృష్టి సారించాలని లేఖలో కోరారు.
పేదలకు సంబంధించి ఇళ్ల నిర్మాణ ప్రాజెక్టు వ్యయం రూ.1,75,421 కోట్లు అయితే, ప్రభుత్వం మాత్రం రూ.91,503 కోట్లుగా చెబుతోంది.. ఈ అంశంలో అనేక సందేహాలున్నాయని లేఖలో పేర్కొన్నారు పవన్.. ఇళ్ల విషయంలో ప్రభుత్వం పేదలను మోసం చేయడమే కాకుండా, ప్రజాధనాన్ని పూర్తిగా దోపిడీ చేసిందన్న ఆయన.. మొదట చెప్పినట్లుగా 30 లక్షల గృహాలను నిర్మించకుండా కేవలం 17,005 జగనన్న లే అవుట్లలో కేవలం 12,09,022 ఇళ్ల స్థలాలు మాత్రమే ఇచ్చారు. ఈ మొత్తం పథకంలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ప్రజాధనాన్ని భారీగా పక్కదారి పట్టించిందని ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. పథకం పేరుతో వైసీపీ నాయకులు భారీగా లాభపడ్డారు. వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన పేదలందరికీ ఇళ్లు పథకంలో కేంద్ర ప్రభుత్వ గృహ స్కీంలను కలిపేసిందన్నారు.. పీఎంఏవై, జేజేఎం, ఎంజీఎన్ఆర్ఈజీపీ, ఎస్బీఎం తదితర కేంద్ర పథకాల నిధులను ఇష్టానుసారం కలిపేసి ఆ నిధులను వైసీపీ పథకానికి వాడుకున్నారని ప్రధాని నరేంద్ర మోడీకి రాసిన లేఖలో పేర్కొన్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.