Pawan Kalyan: జనసేన పార్టీ కీలక నిర్ణయం.. ఆ 26 మంది అవుట్!

Pawan Kalyan

Pawan Kalyan

జనసేన పార్టీ సంస్థాగత నిర్మాణంలో కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది. పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకుంటూ.. రాష్ట్ర అధికార ప్రతినిధులందరినీ రద్దు చేశారు. తెలుగు రాష్ట్రాల్లో పార్టీ తరఫున మీడియా వేదికగా వాయిస్ వినిపిస్తున్న అధికార ప్రతినిధుల బాధ్యతలను తక్షణమే రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.

ప్రస్తుతం జనసేనకు తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 26 మంది అధికార ప్రతినిధులు ఉండగా.. వారిలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 14 మంది పార్టీ తరఫున బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అయితే పార్టీ సంస్థాగత పునర్వ్యవస్థీకరణలో భాగంగా ప్రస్తుతం ఉన్న అధికార ప్రతినిధుల వ్యవస్థను రద్దు చేస్తూ పార్టీ అధిష్ఠానం నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా కొత్త కమిటీలు ప్రకటించే వరకు ఎలాంటి అధికార ప్రతినిధి టెలివిజన్ డిబేట్లలో పాల్గొనకూడదని పవన్ కళ్యాణ్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అలాగే పార్టీ తరఫున మీడియాకు ప్రకటనలు ఇవ్వడం, రాజకీయ అంశాలపై చర్చల్లో పాల్గొనడం కూడా నిలిపివేయాలని సూచించారు. కొత్త కమిటీలు ఏర్పడే వరకు ఈ ఆదేశాలు అమల్లో ఉంటాయని పార్టీ వర్గాలు తెలిపాయి.

త్వరలోనే జనసేన కొత్త అధికార ప్రతినిధుల జాబితాను ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. పార్టీని మరింత బలోపేతం చేయడం, సంస్థాగత నిర్మాణాన్ని సమర్థవంతంగా తీర్చిదిద్దడం లక్ష్యంగా పవన్ కళ్యాణ్ వరుసగా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారని పార్టీ నాయకులు పేర్కొంటున్నారు. ఈ పరిణామం జనసేనలో ప్రాధాన్యత సంతరించుకోగా.. కొత్త అధికార ప్రతినిధులుగా ఎవరికి అవకాశం దక్కుతుందనే అంశంపై ఆసక్తి నెలకొంది.