Site icon NTV Telugu

Cyclone Montha: ప్రజలను అప్రమత్తం చేయండి.. రైతులకి ముందస్తు సమాచారం ఇవ్వండి: పవన్

Pawan Kalyan

Pawan Kalyan

బంగాళాఖాతంలో ఏర్పడిన మొంథా తుపాను కాకినాడ పరిసరాల్లో తీరాన్ని తాకే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు యంత్రాంగం సన్నద్ధంగా ఉండాలని తెలిపారు. కాకినాడ జిల్లా కలెక్టర్‌తో టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. కాకినాడ జిల్లాలో సముద్ర తీరం ఉన్న తుని, పిఠాపురం, కాకినాడ రూరల్, కాకినాడ అర్బన్ నియోజక వర్గాలతో పాటు తాళ్ళరేవు మండలం పైనా తుపాన్ ప్రభావం ఎక్కువగా ఉండబోతుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ విషయంపై డిప్యూటీ సీఎం చర్చించారు.

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ… ‘తుపానుపై ప్రజలను అప్రమత్తం చేయండి. జిల్లా వ్యాప్తంగా తీరం వెంబడి ఉన్న గ్రామాల ప్రజలను సురక్షితంగా ఉంచేందుకు తగిన చర్యలు తీసుకోండి. తుపాను షెల్టర్లలో ఆహారం, ఔషధాలు, పాలు లాంటివన్నీ సమకూర్చి ఉంచండి. వాతావరణ శాఖ హెచ్చరికలకు అనుగుణంగా అన్ని విభాగాలను సిద్ధం చేయాలని సూచించారు. రెవెన్యూ, వ్యవసాయ, నీటిపారుదల, పోలీస్, అగ్నిమాపక శాఖలతోపాటు డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ బృందాలను సిద్ధంగా ఉంచాలి. ఉప్పాడ సమీపంలో తీరం కోతకు గురయ్యే ప్రాంతంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. మత్స్యకారులను అప్రమత్తం చేయండి’ అని స్పష్టం చేశారు.

Also Read: CM Chandrabau: మొంథా తుఫాన్ వస్తోంది.. అప్రమత్తంగా ఉండండి, అవసరమైతే సెలవు!

ఏలేరు రిజర్వాయర్ పరిస్థితిపై డిప్యూటీ సీఎం పవన్ ఆరా తీశారు. రిజర్వాయర్ పూర్తి సామర్థ్యానికి చేరువగా నీటి నిల్వలు పెరుగుతున్నాయని, నీటిని వదిలేటప్పుడు ప్రజలను అప్రమత్తం చేస్తామని జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ తెలిపారు. వరద ముంపు పరిస్థితి వస్తే నీటిపారుదల శాఖ అధికారులతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకోవాలని.. పిఠాపురం, పెద్దాపురం నియోజక వర్గాల రైతులు, ప్రజలకి సమాచారం ఇవ్వాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సూచించారు. మొంథా తుపాను ప్రభావం కాకినాడ జిల్లాపై ఉంటుందని తెలిసిన క్రమంలో కాకినాడ వెళ్ళేందుకు సిద్ధం కాగా, ఈ పరిస్థితుల్లో వద్దని సహాయక చర్యల సన్నద్ధతలో యంత్రాంగం నిమగ్నమై ఉంటుందని, ఇప్పుడు జిల్లా పర్యటన వద్దని జిల్లా కలెక్టర్ సున్నితంగా సూచించారు.

Exit mobile version