Parliament Winter Session : నిర్ణీత షెడ్యూలు కంటే వారం ముందే పార్లమెంటు ఉభయ సభలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. నిజానికి షెడ్యూల్ ప్రకారం అయితే ఈ నెల 29 వరకు సమావేశాలు కొనసాగాల్సి ఉంది. ఆరు రోజులు ముందుగానే వాయిదాకు గురయ్యాయి. పార్లమెంటు శీతాకాల సమావేశాలు ఈ నెల 7న మొదలు కావడం తెలిసిందే. లోక్సభ బిజినెస్ అడ్వైజరీ కౌన్సిల్ (బీఏసీ) సమావేశంలో పార్లమెంట్ శీతాకాల సమావేశాలను డిసెంబర్ 23న వాయిదా వేయాలని ఏకగ్రీవంగా నిర్ణయించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
Read Also: Charles Sobhraj: జైలు నుంచి బయటకు వచ్చిన బికినీ కిల్లర్
బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశంలో లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా, అధికార, ప్రతిపక్షాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సమావేశాలలో 97 శాతం ఉత్పాదకత రేటు నమోదైనట్టు స్పీకర్ ఓంబిర్లా ప్రకటించారు. మొత్తం 62 గంటల 42 నిమిషాల పాటు పనిచేసినట్టు చెప్పారు. చివరి రోజు శుక్రవారం కూడా పార్లమెంటులో ప్రతిపక్షాల నిరసనలు కొనసాగాయి. అరుణాచల్ ప్రదేశ్ లోని తవాంగ్ నియంత్రణ రేఖ వద్ద చైనా, భారత్ బలగాల ఘర్షణ అంశం ఈ విడత సమావేశాలను కుదిపేసిన వాటిల్లో ప్రధానమైనది. దీన్ని అడ్డం పెట్టుకుని అధికార బీజేపీని ఇరుకున పెట్టాలని కాంగ్రెస్ ప్రయత్నించింది. ఘటనపై ప్రభుత్వం ఉభయసభల్లో ప్రకటనలు చేసి చేతులు దులుపుకోగా.. ప్రతిపక్షాలు మాత్రం సమగ్ర చర్చ జరగాలని పట్టుబట్టాయి. ప్రభుత్వం చర్చకు అంగీకరించకపోవడంతో నిత్యం రభస కొనసాగింది.
Read Also: Russia Ukraine War : రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి ఫుల్ స్టాప్ ?
ఇక రాజ్యసభ 258వ సెషన్ కూడా నిర్ణీత షెడ్యూలు కంటే ఆరు రోజుల ముందుగా శుక్రవారం వాయిదా పడింది. చైర్మన్ జగదీప్ ధన్ఖర్ సభను వాయిదా వేస్తూ సభలో తాను భాగమవ్వడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. క్రిస్మస్, పొంగల్, లోహ్రీ, ఇతర పండుగల నేపథ్యంలో సభ్యులకు ఛైర్మన్ తన శుభాకాంక్షలు తెలియజేశారు. పెరుగుతున్న కోవిడ్ మహమ్మారి కేసుల పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని, అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.