Khiladi Wife: పక్కా ప్లాన్ చేసింది.. భర్తను లేపేసింది..

Plan Murder

Plan Murder

వాళ్లిద్దరూ ప్రేమించుకున్నారు… పెద్దలు ఒప్పుకోకపోయినా ఎదిరించి మరీ పెళ్లి చేసుకున్నారు… వారి అన్యోన్య దాపంత్యానికి గుర్తుగా ఇద్దరు మగపిల్లలు సంతానం… అందరూ కలిసి మెలిసి ఆనందంగా జీవనం కొనసాగిస్తున్నారు… వివాహేతర సంబంధం వారి కాపురంలో చిచ్చుపెట్టింది… తమ వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని భావించిన ఆ కసాయి భార్య… భర్తను పక్కా పథకం ప్రకారం లేపేసింది… తర్వాత ప్రమాదమంటూ కట్టుకథ చెప్పి పోలీసులకు అడ్డంగా దొరికిపోయింది. ఇంతకీ ఎవరా కంత్రీ.. ఖిలాడీ వైఫ్..?

ఇక్కడ కాలిన గాయాలతో అల్లాడిపోతున్న ఇతని పేరు పవన్ కుమార్. ఊరు పల్నాడు జిల్లా రాజుపాలెం మండలం ఆర్.ఆర్. సెంటర్. ఇక ఈ ఫొటోలో కనిపిస్తున్న ఈమె పేరు సంధ్యాబాయి. పవన్ కుమార్ భార్య. వీరిద్దరిది ప్రేమ వివాహం. పవన్ కుమార్‌కు తల్లితండ్రులు బంధువుల అమ్మాయితో పెళ్లి కుదిర్చారు. అప్పటికే సంద్యాబాయితో ప్రేమలో ఉన్న పవన్ కుమార్ పెద్దలు కుదిర్చిన సంబంధాన్ని కాదని అందరినీ ఎదిరించి మరీ సంధ్యాబాయిని 2017లో పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు ఏడేళ్ల ప్రేమ్ కుమార్, ఆరేళ్ల దేవాస్ నాయక్ ఉన్నారు.

పవన్ కుమార్ కూలీ పనులకు వెళ్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. వారం రోజుల క్రితం పవన్ కుమార్ ఇంట్లో మంటలు చెలరేగాయి. మంటలు అంటుకుని పవన్ కుమార్‌ తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే చికిత్సకోసం ఆసుపత్రికి తరలించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఏం జరిగిందని భార్య సంధ్యాబాయిని అడిగారు. తన భర్త పవన్ కుమార్ కొంతకాలంగా మద్యానికి బానిసయ్యాడని చెప్పింది. ఇదే విషయంపై ఇద్దరి మధ్య గొడవ జరిగిందని.. తర్వాత ఇంట్లో ఉన్న గ్యాస్ సిలిండర్ లీక్ చేయడంతో నిప్పంటుకుందని చెప్పింది. దీంతో ఫైర్ సిబ్బందికి పోలీసులు సమాచారం అందించారు. ఫైర్, పోలీసులు పవన్ కుమార్ ఇంటిని పరిశీలించారు. అయితే ఇంట్లో ఎలాంటి గ్యాస్ లీకైనట్లు ఆనవాళ్లు కనిపించలేదు. దీంతో భార్య సంధ్యాబాయిపై అనుమానం వచ్చింది.

అదే సమయంలో ఆసుపత్రిలో పవన్ కుమార్ కు చికిత్స అందిస్తున్న డాక్టర్లు కూడా గ్యాస్ లీకవడం వల్ల గాయాలు కాలేదని.. ఒంటిపై పెట్రోల్ పోసి నిప్పంటించినట్లుందని చెప్పారు. దీంతో పోలీసుల అనుమానం మరింత పెరిగింది. ఇక పవన్ కుమార్ బంధువులను కూడా పోలీసులు మరింత లోతుగా విచారించారు. మృతుడు పవన్ కుమార్ బంధువులు సంద్యాబాయి ప్రవర్తనపై అనుమానాలు వ్యక్తం చేశారు. సంధ్యాబాయి వివాహేతర సంబంధాలు కొనసాగిస్తున్నట్లు కూడా పోలీసుల దృష్టికి తీసుకొచ్చారు. పవన్ కుమార్ మృతికి కారణం భార్య సంధ్యాబాయి అని ఆరోపించారు. అంతేకాదు సంధ్యాబాయి ఎవరితో వివాహేతర సంబంధం పెట్టుకుందో కూడా వారి వివరాలు కూడా క్లియర్‌గా తెలిపారు.

పవన్ కుమార్ బంధువులు, కుటుంబ సభ్యులు చెప్పిన సమాచారంతో సంధ్యాబాయిని అదుపులోకి తీసుకుని పోలీసులు మరింత లోతుగా విచారించారు. దీంతో పవన్ కుమార్ హత్య విషయం బయటకొచ్చింది. వివాహేతర సంబంధం వ్యవహారం పవన్ కుమార్ కు తెలియడంతో భార్యాభర్తల మధ్య గొడవలు మొదలైనట్లు పోలీసుల విచారణలో సంధ్యాబాయి చెప్పుకొచ్చింది. దీంతో ఇంట్లో నిద్రపోతున్న భర్త పవన్ కుమార్ పై పెట్రోలు పోసి నిప్పంటించినట్లు అంగీకరించింది. బయటకొచ్చి ఏమీ తెలియనట్లుగా గ్యాస్ లీకై మంటలు చెలరేగినట్లు చెప్పి తప్పించుకోవాలని చూసినట్లు కట్టుకథ చెప్పి అడ్డంగా బుక్కయ్యింది. పవన్ కుమార్ హత్య వ్యవహారంలో సహకారం అందించిన మైనర్ తోపాటు కిరణ్ కుమార్, రమేష్‌లను అరెస్ట్ చేశామంటున్నారు పోలీసులు.