Pakistan: ఇరాన్ – అమెరికా మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం వెనుక అసలు కథ ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. మిత్రదేశంగా ఇరాన్ను ఒప్పించినట్లు కనిపిస్తున్న పాకిస్థాన్, నిజానికి అమెరికా చెప్పినట్లే ఆడిందని అంతర్జాతీయ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఈ మొత్తం వ్యవహారంలో పాక్ కేవలం అగ్రరాజ్యం ఆదేశాలను అమలు చేసే ఒక ‘మధ్యవర్తి’గా మాత్రమే వ్యవహరించిందని, ఇది ఇరాన్కు చేసిన ద్రోహమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
READ ALSO: TPCC Mahesh Goud : జీవన్ రెడ్డికి అన్ని ఇచ్చింది కాంగ్రెస్సే.. ఆధారాలు ఉంటే గాంధీ భవన్కు రండి
అమెరికా స్క్రిప్ట్.. పాక్ యాక్షన్..
ఫైనాన్షియల్ టైమ్స్, న్యూయార్క్ టైమ్స్ వంటి అంతర్జాతీయ మీడియా సంస్థల నివేదికల ప్రకారం.. ఈ కాల్పుల విరమణ వెనుక మూడు కీలక అంశాలు ఉన్నాయి.
చివరి నిమిషంలో వ్యూహం: ఏప్రిల్ 7న ఇరాన్పై దాడి చేస్తానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించినప్పటికీ, వైట్ హౌస్ అధికారులు మాత్రం యుద్ధం కంటే చర్చలే మేలని భావించారు. ఇందుకోసం ఇరాన్కు పొరుగు దేశమైన పాకిస్థాన్ను ఒక ఆయుధంగా వాడుకున్నారు. నిజానికి ఈ యుద్ధంలో టెహ్రాన్ పాకిస్థాన్పై ఒక్క దాడి కూడా చేయలేదు. అలాగే పాకిస్థాన్ ఇరాన్కు పొరుగు దేశం. అందుకే అమెరికాకు పాక్ తప్ప వేరే ఆప్షన్ లేకుండా పోయింది.
వైట్ హౌస్ కనుసన్నల్లో పాక్ ప్రధాని పోస్ట్: పాక్ ప్రధాని షాబాజ్ షరీఫ్ సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ కూడా స్వతంత్రంగా చేసింది కాదని సమాచారం. ఆ పోస్ట్ యొక్క డ్రాఫ్ట్ను కూడా వైట్ హౌస్ ఆమోదించిన తర్వాతే ఆయన పంచుకున్నారని న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది.
చైనాను రంగంలోకి దించడం: అమెరికా ప్రతిపాదనను ఇరాన్ మొదట తిరస్కరించడంతో, ఇస్లామాబాద్ వెంటనే చైనా సహాయం కోరింది. బీజింగ్ జోక్యంతోనే ఇరాన్ చివరకు ఈ కాల్పుల విరమణకు తలొగ్గిందని అంటున్నారు.
ఇస్లామాబాద్లో చారిత్రాత్మక భేటీ..
శనివారం పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్లో జరగనున్న ఈ శాంతి సమావేశానికి అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బఘేర్ ఘాలిబాఫ్ హాజరుకానున్నారని సమాచారం. అయితే ఈ వేదిక వెనుక అమెరికాకు రెండు స్పష్టమైన లక్ష్యాలు ఉన్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పాకిస్థాన్ ద్వారా ఇరాన్పై మరింత ఒత్తిడి పెంచడం ఒకటి అయితే, పశ్చిమ ఆసియా రాజకీయాల్లో పాకిస్థాన్కు ప్రాధాన్యత కల్పించి, దానిని తన వైపు తిప్పుకోవడం రెండో లక్ష్యాలుగా చెబుతున్నారు.
ఈ పరిణామాలపై ఇరాన్ అధికారికంగా పాకిస్థాన్ను నిందించనప్పటికీ, ఆ దేశ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరఘ్చి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. లెబనాన్పై ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో.. “అమెరికా కాల్పుల విరమణ హామీలను ఎలా ఉల్లంఘిస్తోందో ప్రపంచం చూస్తోంది” అని ఆయన పేర్కొన్నారు. ప్రధాని షాబాజ్ షరీఫ్ హామీ ఇచ్చినట్లుగా లెబనాన్పై దాడులు ఆగకపోవడంతో, పాక్ మాటలను ఇరాన్ నమ్మడం లేదని స్పష్టమవుతోంది. మొత్తానికి ఇరాన్తో ఉన్న స్నేహ బంధం కంటే అమెరికా ప్రయోజనాలకే పాకిస్థాన్ పెద్దపీట వేసిందన్న చర్చ ఇప్పుడు అంతర్జాతీయ దౌత్య వర్గాల్లో జోరుగా సాగుతోంది.
READ ALSO: Samantha : ఈ రోజు నేను ఇంత ధైర్యంగా ఉన్నానంటే కారణం ఆయనే