T20 World Cup: పాకిస్థాన్కు మరో చిక్కు వచ్చి పడింది. సెమీ ఫైనల్ ఆశలు రోజు రోజుకీ క్షీణిస్తున్నాయి. నిన్న(మంగళవారం) శ్రీలంకపై న్యూజిలాండ్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. దీంతో మరోసారి పాక్ ఆశలు సన్నగిల్లాయి. ఆ మ్యాచ్లో మిచెల్ సాంట్నర్ బ్యాటింగ్తో మెరిపించగా, రచిన్ రవీంద్ర బౌలింగ్ (4/27)లో చెలరేగి కివీస్కు 61 పరుగుల భారీ విజయాన్ని అందించాడు. అయితే.. గ్రూప్ 2 పట్టికలో ఇప్పటికే ఇంగ్లండ్ జట్టు రెండు మ్యాచుల్లో నాలుగు పాయింట్లతో సెమీఫైనల్ బెర్త్ కన్ఫామ్ చేసుకుంది. మరోవైపు.. న్యూజిలాండ్ మూడు పాయింట్లతో రెండో స్థానానికి చేరుకుంది. ప్రస్తుతం పాకిస్థాన్ మూడో స్థానానికి పడిపోయింది. శ్రీలంక ఇప్పటికే టోర్నీ నుంచి ఔట్ అయ్యింది. ఇక్కడ నెట్ రన్రేట్ విషయంలోనూ కివీస్ భారీ ఆధిక్యంలో ఉండటం పాకిస్థాన్కు పెద్ద మైనస్గా మారింది.
READ MORE: Off The Record : నరసన్నపేట పొలిటికల్ స్క్రీన్పై మారుతున్న సీన్స్..
ఇప్పుడు పాకిస్థాన్ పరిస్థితి పూర్తిగా ఇతర మ్యాచ్ ఫలితాలపై ఆధారపడింది. ఫిబ్రవరి 28న శ్రీలంకతో జరిగే తమ చివరి మ్యాచ్ను తప్పనిసరిగా భారీ తేడాతో గెలవాలి. ఎంత భారీ విజయం సాధించినా ఇంకా సరిపోదు. ఒక రోజు ముందు జరిగే న్యూజిలాండ్-ఇంగ్లాండ్ మ్యాచ్లో ఇంగ్లండ్ చాలా పెద్ద మార్జిన్తో విజయం సాధించాల్సి ఉంటుంది. అలా జరిగితేనే రెండు జట్లు మూడు పాయింట్లతో సమంగా నిలుస్తాయి. ఆ తర్వాత నెట్ రన్రేట్ సమీకరణలు కీలకం అవుతాయి. మరోవైపు.. పాకిస్థాన్ శ్రీలంక చేతిలో ఓడిపోతే ఇంటికి పెట్టే బేడ సర్దుకుని వెళ్లాల్సిందే. న్యూజిలాండ్ ఇంగ్లాండ్పై గెలిస్తే పాకిస్థాన్ మ్యాచ్ ఆడకముందే ఎలిమినేట్ అవుతుంది. ఒకవేళ ఆ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయినా పాకిస్థాన్ గెలిచినా ఉపయోగం ఉండదు. ఈ సమీకరణాలు చూస్తుంటే.. పాకిస్థాన్కు ‘డూ ఆర్ డై’ పరిస్థితి తప్పడం లేదు.
