Balochistan: బలూచిస్తాన్ మరికొన్ని రోజుల్లోనే పాకిస్తాన్ నుంచి విడిపోతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా, బలూచ్ లిబరేషన్ ఆర్మీ(బీఎల్ఏ) పాకిస్తాన్ ఆర్మీ, ఐఎస్ఐకి చుక్కలు చూపిస్తుంది. పాకిస్తాన్ ఆర్మీ బయటకు వెళ్తే, ప్రాణాలతో తిరిగి వస్తారనే గ్యారెంటీ లేదు. ఇదిలా ఉంటే, పాకిస్తాన్ మాజీ ప్రధాని షాహిద్ ఖాకాన్ అబ్బాసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. బలూచిస్తాన్ పాకిస్తాన్ చేజారి పోతోందని అన్నారు. ఇప్పటికే, చాలా ప్రాంతాల్లో పాక్ ప్రభుత్వ నియంత్రణ లేదని, అది పాకిస్తాన్ నియంత్రణ నుంచి జారిపోయిందని అన్నారు.
మంత్రులు, ఉన్నతాధికారులు సెక్యూరిటీ ఎస్కార్ట్ లేకుండా బలూచిస్తాన్ ప్రావిన్సులో తిరగలేరని అన్నారు. 2017 నుండి 2018 వరకు పాకిస్తాన్ ప్రధాన మంత్రి అబ్బాసి ఇటీవల ది బలూచిస్తాన్ పోస్ట్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో బలూచిస్తాన్లో పరిస్థితి మరింత భయంకరంగా ఉందని పేర్కొన్నారు. ముఖ్యంగా, రాత్రి సమయాల్లో ఈ ప్రాంతం మరింత ప్రమాదకరంగా మారుతుందని చెప్పారు. బలూచ్లో కేవలం 1500 మంది మాత్రమే అశాంతికి కారణమవుతున్నారని పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ చేసిన వ్యాఖ్యల్ని ఆయన తప్పుపట్టారు. అది ఆయన అభిప్రాయమని, నేను చూసింది చెబుతున్నానని అబ్బాసీ అన్నారు.
Read Also: Operation Sindoor: చైనా ప్రొడక్ట్స్ నమ్మెద్దు బ్రో.. భారత్ క్షిపణుల్ని గుర్తించని చైనీస్ రాడార్లు..
బలూచ్ ప్రావిన్సు అంతటా భయం, అనిశ్చితి ఉందని, రక్షణ లేకుండా ప్రభుత్వ అధికారులు, నేతలు బయట తిరిగే పరిస్థితి లేదని అబ్బాసీ చెప్పారు. రాజధాని క్వెట్టాలో చీకటి అయితే, రాష్ట్రం ఉనికి దాదాపుగా కనుమరుగవుతోందని చెప్పారు. బలూచ్ ఫైటర్స్ ఇప్పుడు ప్రావిన్స్ వ్యాప్తంగా బహిరంగంగా గస్తీ నిర్వహిస్తున్నారని, చెక్ పోస్టులు ఏర్పాటు చేసుకుంటున్నారని, పట్టణాలు వారి నియంత్రణలోకి వెళ్లిపోతున్నాయని చెప్పారు.
నవాజ్ షరీఫ్ అనర్హత వేటు తర్వాత, పాకిస్తాన్ ముస్లిం లీగ్-నవాజ్ (PML-N)కి ప్రాతినిధ్యం వహిస్తూ, షాహిద్ ఖాకాన్ అబ్బాసి ఆగస్టు 2017 నుండి మే 2018 వరకు పాకిస్తాన్ ప్రధానమంత్రిగా పనిచేశారు. 2024లో, అబ్బాసి PML-N నుంచి బయటకు వచ్చారు. బలూచిస్తాన్ వ్యూహాత్మకంగా పాకిస్తాన్కి కీలకం. చైనా గ్వాదర్ పోర్టుని నిర్మిస్తుంది. దీంతో పాటు చైనా-పాక్ ఎకనామిక్ కారిడార్(CPEC) ప్రాజెక్టులో బలూచిస్తాన్ కీలకం. కానీ ఇప్పుడు పాకిస్తాన్ అధికారం అక్కడ లేదు. అత్యంత ఖనిజ సంపద, సహజవాయువు నిక్షేపాలు ఉన్న బలూచిస్తాన్ పాకిస్తాన్లోనే అతిపెద్ద రాష్ట్రం. కానీ, అతి తక్కువ జనాభా కలిగి ఉంది. ఈ ప్రాంతంపై పాక్ అణిచివేత తీవ్రంగా ఉంది. దీంతోనే బలూచ్ ప్రజలు తమకు స్వాతంత్ర్యం కావాలని కోరుకుంటున్నారు.