Pakistan-Afghanistan: పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరుకుంటున్నాయి. తాజాగా ఇరు దేశాల మధ్య కొత్త టెన్షన్ వచ్చి పడింది. ఆప్ఘనిస్థాన్లోని కాందహార్ ప్రాంతంలో తాలిబన్ సంబంధిత స్థావరంపై పాకిస్థాన్ వైమానిక దాడి చేసింది. ఇటీవలి డ్రోన్ దాడులకు ప్రతీకారంగా ఈ దాడి చేసినట్లు పాకిస్థాన్ పేర్కొంది. గత కొన్ని రోజులుగా పాకిస్థాన్లోని వివిధ నగరాలపై అనేక డ్రోన్లు కనిపించాయని పాకిస్థాన్ సైన్యం చెబుతోంది. చాలా డ్రోన్లను సకాలంలో అడ్డగించామని, అవి తమ లక్ష్యాలను చేరుకోకుండా నిరోధించాయని పాకిస్థాన్ సైన్యం పేర్కొంది. అయితే.. విచ్ఛిన్నమయ్యాక భూమి మీద పడిపోతున్న డ్రోన్ శిథిలాలు కొన్ని ప్రాంతాలలో నష్టాన్ని కలిగించాయని వెల్లడించింది. క్వెట్టాలో శిథిలాల వల్ల ఇద్దరు పిల్లలు గాయపడగా, కోహత్, రావల్పిండిలలోనూ అనేక మంది గాయపడ్డారని తెలిపింది.
ఈ సంఘటనపై తీవ్రంగా స్పందించిన పాకిస్థాన్ ఈ దాడులు జరిపినట్లు చెబుతున్నారు. దేశంలోని పౌరులను, భద్రతా స్థావరాలను లక్ష్యంగా చేసుకోవడం పాకిస్థాన్ సైన్యం తీవ్రంగా మండిపడింది. డ్రోన్ దాడులు ఆప్ఘనిస్థాన్ కాందహార్లోని సైనిక స్థావరానికి సంబంధించినవని పాకిస్థాన్ ఆరోపించింది. తత్ఫలితంగా, పాకిస్థాన్ ఆ స్థావరాన్ని లక్ష్యంగా చేసుకుని వైమానిక దాడి ప్రారంభించింది. తాజా నివేదికల ప్రకారం.. డ్రోన్ కార్యకలాపాలను గుర్తించిన తర్వాత ముందు జాగ్రత్త చర్యగా ఇస్లామాబాద్ చుట్టూ ఉన్న వైమానిక ప్రాంతాన్ని తాత్కాలికంగా మూసివేశారు. ఈ సంఘటన రెండు దేశాల మధ్య సంబంధాలను మరింత దెబ్బతీస్తుందని భావిస్తున్నారు. పాకిస్థాన్కు చెందిన ప్రముఖ మీడియా సంస్థ సమా టీవీ (Samaa TV) ప్రకారం.. తాలిబాన్ అనుబంధ యోధులు ఉపయోగించే కాందహార్లోని సాంకేతిక సౌకర్యాలు, ఆయుధ డిపోలను లక్ష్యంగా చేసుకుని పాకిస్థాన్ ఆపరేషన్ జరిగింది. కాందహార్లో జరిపిన దాడులపై కాబూల్ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం అందలేదు.