ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా పూణెలోని లావాసా నగరంలో కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో మూడు ఇళ్లు కూలిపోయాయి. అంతేకాకుండా.. ఓ యువకుడు మృతి చెందాడు. కాగా కొండచరియలు విరిగిపడిన శిథిలాల కింద ఇద్దరు చిక్కుకున్నారు. వర్షం కారణంగా పూణె, థానేలో వరదలు పొంగిపొర్లుతున్నాయి. నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి.. డ్యామ్లలో నీటిమట్టం పెరిగింది. వర్షం కారణంగా ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఈ క్రమంలో.. ప్రభుత్వం ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తోంది. ప్రజలను రక్షించే పనిలో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు నిరంతరం నిమగ్నమై ఉన్నాయి.
మహారాష్ట్రలోని థానే జిల్లాలో వర్షం ప్రజల ఇబ్బందులను పెంచింది. జిల్లాలో ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఐదు గంటల్లో 135 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. ఈ సీజన్లో ఇప్పటివరకు 142.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. గురువారం అంబర్నాథ్తో పాటు జిల్లాలోని ఇతర ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అంబర్నాథ్లోని సాహ్వాస్ వృద్ధాశ్రమంలోని 18 మంది పెద్దలను మహర్ వృద్ధాశ్రమంలోని పై అంతస్తుకు తరలించారు. సత్కర్మ ఆశ్రమానికి చెందిన 30 మంది పిల్లలను ప్రగతి అంధుల పాఠశాలకు పంపారు. అంతే కాకుండా.. 200 మందిని BSUP భవనంలోకి తీసుకువెళ్లారు. 40 కుటుంబాలకు చెందిన 156 మందిని కళ్యాణ్ నుండి తరలించారు.
PM Modi: శుక్రవారం లడఖ్లో మోడీ పర్యటన.. షింకున్ లా టన్నెల్ ప్రాజెక్ట్ ప్రారంభం
భారీ వర్షాల కారణంగా కళ్యాణ్ జిల్లాలోని బద్లాపూర్ బ్యారేజీ, జంబుల్ డ్యామ్, మోహనే డ్యామ్, ఉల్లాస్ నదిలో నీటిమట్టం ప్రమాదకర స్థాయికి చేరుకుంది. దీంతో.. మోహనే, వరప్, వల్ధుని, కళ్యాణ్, అనే, భిసోల్, రైటే, ఆప్తి, దహగావ్, మంఝర్లీ, అంబర్నాథ్లోని బద్లాపూర్, ఇరంజాద్, కుద్సర్వే, కన్హేరే, కస్గావ్, ఉల్హాస్నగర్కు చెందిన షాహద్, మహరల్, భివాండికి చెందిన డైవ్ అగర్, రాజనోలి గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మరోవైపు.. తాంసా డ్యాంలో నీటిమట్టం 99.18 శాతానికి చేరుకోవడంతో చుట్టుపక్కల గ్రామాల్లో హై అలర్ట్ ప్రకటించారు. వరదల ధాటికి భివాండి, షాపూర్లలో ఐదు ఇళ్లు దెబ్బతిన్నాయి.
కళ్యాణ్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం కారణంగా.. రుండే, రైతే వంతెనలపై రాకపోకలు నిలిచిపోయాయి. నది ఒడ్డున నివసించే ప్రజలను అప్రమత్తం చేశారు. అంతే కాకుండా.. చిక్లి వంతెన మునిగిపోవడంతో కళ్యాణ్-ముర్బాద్ రోడ్, ముర్బాద్-సహాపూర్ రోడ్లు మూసివేశారు. సహాయక చర్యల కోసం అధికారులు థానేలో రెండు ఎన్డిఆర్ఎఫ్ బృందాలను మోహరించారు. కొండచరియలు విరిగిపడిన శిథిలాలలో చిక్కుకున్న యువకుల కోసం ఎన్డీఆర్ఎఫ్ వెతుకుతోంది.