NTV Telugu Site icon

Off The Record : తెలంగాణలో అధికార పార్టీ నేతలకు అధికారులే టార్గెట్..? సర్కార్‌లో అసలేం జరుగుతోంది..?

Telangana Otr

Telangana Otr

తెలంగాణలో అధికార పార్టీ నేతలకు అధికారులే టార్గెట్ అయ్యారా? సీఎం, పీసీసీ అధ్యక్షుడి నుంచి మొదలుపెట్టి కింది స్థాయి ఎందుకు అధికారుల మీద అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు? అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర అయినా… అధికార యంత్రాంగం మీద గ్రిప్‌ రాలేదా? లేక ప్రభుత్వ సిబ్బందే కాంగ్రెస్‌ నేతల్ని లైట్‌ తీసుకుంటున్నారా? సర్కార్‌లో అసలేం జరుగుతోంది? తెలంగాణలో అధికారుల మీద ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఎమ్మార్వో నుంచి ఐఏఎస్‌ దాకా ఎవరూ సక్రమంగా పనిచేయడం లేదని అధికార పార్టీ నాయకులే కామెంట్‌ చేస్తున్న పరిస్థితి. వాళ్ళు పనితీరు మార్చుకోవాలంటూ… ఆ మధ్య స్వయంగా పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌ హెచ్చరించారు. రంగారెడ్డి జిల్లా ఖాజాగుడా చెరువు దగ్గర వేల కోట్లతో ఓ కంపెనీ పెద్ద ప్రాజెక్టు నిర్మిస్తోంది. దీని వెనుక కేటీఆర్ హస్తం ఉందని హైడ్రా కు ఫిర్యాదు చేసినా… కంప్లయింట్‌ తీసుకున్నారే తప్ప… కనీసం ఏక్నాలెడ్జ్ మెంట్ ఇవ్వడం లేదని అన్నారు జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఐఏఎస్ లపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు కలెక్టర్లు ఏసీ రూముల్లోంచి బయటకు రావడం లేదని, జనంలోకి రండని చెబుతున్నా రావడం లేదని అన్నారాయన. వారికి ఏసీ జబ్బు పట్టినట్లుందని కూడా కామెంట్‌ చేశారు సీఎం. అధికారుల ఆలోచనలో, పని విధానంలో మార్పు రావాలన్నారు. నిబద్ధత కలిగిన అధికారులకు తప్పకుండా గుర్తింపు ఉంటుందని కూడా చెప్పిన సీఎం… ఆ దిశగా రాష్ట్రంలో అధికారులు దృష్టి సారించాలని అన్నారు. రాజకీయ నాయకులైనా, అధికారులైనా ప్రజలిచ్చే డబ్బులతో పనిచేస్తున్నామనే విషయాన్ని మర్చి పోకూడదని హెచ్చరించారాయన.

ఇలా…. కొంతకాలంగా రాష్ట్రంలో ప్రభుత్వ అధికారుల తీరు పై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సాక్షాత్తు ముఖ్యమంత్రి నోటి నుంచే అలాంటి మాటలు వచ్చాయంటే… ఐఎఎస్‌లు ఎలా పనిచేస్తున్నారో ఊహించుకోవచ్చన్న కామెంట్స్‌ వస్తున్నాయి. అధికారుల పై ప్రతి సమావేశంలో ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేస్తూ హెచ్చరిస్తూనే ఉన్నారు. అయినా మార్పు రావడం లేదంటూ కాంగ్రెస్ నాయకులు బాహాటంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఇటు సెక్రటేరియట్ లో కూడా మంత్రులు ఏదైనా విషయాన్ని ఉన్నతాధికారులకు చెబితే నెలలు గడిచినా పని జరగడం లేదని… కొన్ని సందర్భాల్లో మంత్రుల ఆదేశాలను సైతం ధిక్కరించి ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారన్న చర్చ జరుగుతోంది.అయితే… ఇది అక్కడితో ఆగలేదట. ఐఎఎస్‌లు మా మాట వినడం లేదని మంత్రులు, పెద్ద నాయకులు వాపోతుంటే… జూనియర్ ఐఏఎస్ లు, గ్రూప్ 1, గ్రూప్ 2 స్థాయి అధికారులు మమ్మల్ని పట్టించుకోవడం లేదని సీనియర్‌ ఐఎఎస్‌లు మొత్తుకుంటున్నట్టు సమాచారం. గత ప్రభుత్వ హయాంలో అధికారులపై రాజకీయ నాయకుల ఒత్తిడి ఎక్కువగా ఉండేదని… ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదని ప్రభుత్వ సిబ్బంది అంటున్నారు. అలాంటప్పుడు కూడా మంత్రులు, ఎమ్మెల్యేల మాట వినకుండా లెక్కలేని తనంతో వ్యవహరిస్తున్నారంటూ… సెక్రటేరియట్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలను, కార్పోరేషన్ చైర్మన్లను, అధికారులు లైట్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద ప్రభుత్వ ఉద్యోగులు కూడా అధికార, ప్రతిపక్షాల మాదిరిగా విడిపోయి….. ఇష్టారీతిన వ్యవహారిస్తుండటం ప్రభుత్వానికి తలనొప్పిగా తయారైందని అంటున్నారు. ప్రభుత్వ ప్రాధాన్యతలు గుర్తించి పని చేస్తే ఎవరికి ఎలాంటి ఇబ్బంది ఉండదని, అలా కాకుండా వాళ్ళ వాళ్ళ వ్యక్తిగత రాజకీయ అభిరుచులకు అనుగుణంగా అధికారులు పని చేస్తుంటే మాత్రం ఎప్పటికీ సమస్యేనన్న వాదన గట్టిగా వినిపిస్తోంది ప్రభుత్వ వర్గాల్లో.