అవును… ఆ రెండు పార్టీ నేతలు కలిసిపోయారు. రాష్ట్ర స్థాయిలో బద్ద శతృవుల్లా పోట్లాడుకునే టీడీపీ, వైసీపీ నాయకులు అక్కడ మాత్రం భుజం భుజం కలిపి ఇల్లీగల్ దందాలకు ఎల్లలు లేవని అంటున్నారు. అదేందని ఎవరన్నా అడిగితే… ఇది యాపారం… అంటూ బ్రహ్మానందం డైలాగ్ని గుర్తు చేస్తున్నారట. ఏంటి వాళ్ళు చేస్తున్న ఆ ఇల్లీగల్ యాపారం? వైసీపీకి టీడీపీ నాయకులు ఏ రూపంలో సహకరిస్తున్నారు? ఆంధ్రప్రదేశ్లోని చాలా చోట్ల జరుగుతున్నట్టుగానే…కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గంలో కూడా రేషన్ బియ్యం దందా నడుస్తోందట. కానీ…. ఇక్కడ దందా కాస్త డిఫరెంట్గా నడుస్తున్నట్టు తెలుస్తోంది. రాష్ట్ర స్థాయిలో వాళ్ళు వాళ్ళు ఎంత కొట్టుకున్నా…. మనకేం సంబంధం లేదు. ఇక్కడ మాత్రం మనం మనం మంత్రాలయం అంటూ….టీడీపీ, వైసీపీ లీడర్స్ భుజం భుజం రాసుకు తిరుగుతున్నారట. చేసేది ఇల్లీగల్ అయినా… అందులో కూడా ఎథిక్స్ పాటిద్దామంటూ… ఎవ్వరూ ఎవ్వరికీ అడ్డుపడకుండా కలిసిమెలిసి యాపారం చేసేసుకుంటున్నారట. ఈ బిజినెస్లో ఇప్పటికే వైసీపీ నాయకులు ఆరితేరిపోగా…. ఇప్పుడు కూడా వారిని ఏ మాత్రం డిస్ట్రబ్ చేయకుండా… అవసరమైన అధికార అండదండలు అందిస్తున్నారట తెలుగుదేశం నాయకులు. ఆ విధంగా భాయి భాయి అంటూ రెండు పార్టీల వాళ్ళు కలిసి మెలిసి రేషన్ బియ్యాన్ని సరిహద్దు దాటిస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. మంత్రాలయం నియోజకవర్గం పూర్తిగా కర్ణాటక సరిహద్దులో ఉంటుంది. దీంతో రేషన్ బియ్యాన్ని బోర్డర్ దాటించడం తేలిక. అందుకు కావాల్సింది కాస్త అధికారపార్టీ నేతల సహకారం మాత్రమే. అందుకే ఇక్కడ టీడీపీ, వైసీపీ మిలాఖత్ రాజకీయం నడుస్తోందంటూ కోడై కూస్తున్నారు పబ్లిక్. పార్టీలదేముంది అన్నా… అది రాజకీయం. డబ్బులు ఊరికే వస్తాయా ఏంటి? జస్ట్… మనం సర్దుబాటు చేసుకోవాలంతే…. అనే రీతిలో ఇక్కడ వ్యవహారాలు కొనసాగుతున్నాయట. మంత్రాలయం, కోసిగి, కౌతాళం, పెద్దకడుబూరు మండలాల్లో ఇల్లిల్లు తిరిగి రేషన్కార్డుదారుల నుంచి కిలో పది రూపాయల చొప్పున కొని 15 రూపాయలకు అమ్మేసుకుంటున్నట్టు సమాచారం. ఈ బియ్యాన్ని కొందరు నేతలు తమకు అడ్డాలుగా ఉండే గ్రామాల్లో నిలువ ఉంచుతున్నట్టు తెలుస్తోంది. ఒక లోడ్కు సరిపడా స్టాక్ వచ్చాక లారీల్లో కర్ణాటకకు తరలిస్తున్నారట. ఏపీ సరిహద్దులో చెక్ పోస్టు దాటి కర్ణాటకలో అడుగుపెట్టే వరకు కాస్త ఎక్స్ట్రా కేర్ తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. అలా సరిహద్దు దాటించిన వాళ్ళకి కిలోకి రెండు రూపాయల చొప్పున ఇచ్చుకోవాలట.
ఈ బాధ్యత నెరవేస్తున్నది కూడా వైసీపీ వర్గీయులేనని అంటున్నారు. అలా సరిహద్దు దాటిన బియ్యాన్ని కర్ణాటకలో కిలో 28 నుంచి 30 రూపాయలకు అమ్ముకుంటున్నట్టు సమాచారం. అలా సరిహద్దు దాటిన రేషన్ బియ్యాన్ని రైస్ మిల్లుల్లో సన్న బియ్యంగా మార్చి సోనా మసూరిలో కల్తీ చేసి అమ్ముతారట. ఇలా ప్రతి నెల ఒకటి నుంచి 15 మధ్య యాపారం జోరుగా జరుగుతోందని చెప్పుకుంటున్నారు. అధికారులు, అధికార పార్టీ నేతల అండదండలు పుష్కలంగా ఉండటంతో…. మంత్రాలయం నియోజకవర్గంలో ఇంత జరుగుతున్నా… అక్రమంగా రవాణా అవుతున్న బియ్యం పెద్దగా పట్టుబడలేదని చెప్పుకుంటున్నారు. ఎప్పుడో ఒకసారి పొరపాటున ఏ అధికారి అయినా…. పట్టుకుంటే… వెంటనే టీడీపీ నేతలకు ఫోన్స్ వెళ్తున్నాయట. వాళ్ళు అటు ఫోన్కొట్టి ఆళ్ళు మనోళ్ళే… వదిలేయండంటూ… అధికార స్వరంతో చెబుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. కౌతాళం మండలంలో ఆ మధ్య ఓ రేషన్ బియ్యం లారీ పట్టుబడితే… వైసీపీ నేత విన్నపాల మేరకు టీడీపీ ముఖ్య నాయకులు జోక్యం చేసుకొని విడిపించారట. ఇది విన్న జనం… డబ్బు బాబూ.. డబ్బులు… వాళ్ళు వాళ్ళు బాగానే ఉంటారు. ఫెవికాల్ బంధాలు నడుస్తుంటాయి. మధ్యలో బకరాలయ్యేది మనమేనని మాట్లాడుకుంటున్నారట. బయట కూడా మంత్రాలయం రాజకీయం భలే ఉంది గురూ..అని మాట్లాడుకుంటున్నట్టు చెబుతున్నారు. ఇక్కడ టీడీపీ-వైసీపీ దోస్తీ ఎంతవరకు వెళ్తుందో చూడాలి మరి.