ఆ టీడీపీ ఎమ్మెల్యే నోట సిట్ మాట ఎందుకు వచ్చింది? మాజీ మంత్రిని బెదిరించడానికా? లేక అసలా దిశగా అడుగులు పడుతున్నాయా? ఎమ్మెల్యే అన్న మాటలే నిజమైతే… ఆ ఎక్స్ మినిస్టర్ పరిస్థితి ఏంటి? ఎవరామె? ఆమెను టార్గెట్ చేసిన సిట్టింగ్ శాసనసభ్యుడు ఎవరు? ఉమ్మడి చిత్తూరు జిల్లా వైసీపీ నేతలకు గడ్డు కాలం ఎదురైందా అంటే… అవుననే అంటున్నాయి రాజకీయవర్గాలు. జిల్లాలో ఉన్న సీనియర్స్ అంతా.. ఏదో ఒక అవినీతి అక్రమాల కేసులో ఇరుకున్నవారే. ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఇప్పటికే ల్యాండ్ ,శ్యాండ్, మంగళంపేట అటవీ భూములు,బుగ్గమఠం భూముల ఆక్రమణ, మదనపల్లి సబ్ రిజిస్టర్ కార్యాలయం అగ్ని ప్రమాద ఘటన వ్యవహారం వెంటాడుతున్నాయి. తుడా నిధుల దుర్వినియోగం చెవిరెడ్డిని, టీడీఆర్ బాండ్స్ వ్యవహారం భూమనను, లిక్కర్ కేసు నారాయణస్వామిని భయపెడుతున్నట్టు చెప్పుకుంటున్నారు. ఇక మాజీ మంత్రి రోజాను సైతం ఆడుదాం ఆంధ్ర కేసు వెంటాడుతోంది. అది చాలదన్నట్టు చిత్తూరు మినీ మహానాడులో నగరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ చేసిన కామెంట్స్ జిల్లా రాజకీయవర్గాల్లో చర్చనీయాంశం అయ్యాయి. నగరి సెగ్మెంట్లో రోజా చేసిన అవినీతి, అక్రమాలు, లంచాల వ్యవహారాల సంగతి తేలాలంటే… ప్రత్యేకంగా సిట్ వేసి దర్యాప్తు జరపాలంటూ బాంబు పేల్చారు గాలి. మిగతా వాళ్ళ సంగతి ఎలా ఉన్నా… ఇప్పుడు దీని చుట్టూనే తిరుగుతోందట ఉమ్మడి చిత్తూరు రాజకీయం. గత ప్రభుత్వ హయాంలో 120 కోట్లతో నిర్వహించిన ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో భారీగా నిధులు గోల్మాల్ అయ్యాయన్న ఆరోపణలున్నాయి. నాణ్యత లేని ఆట వస్తువులు, బ్రోచర్లు, జెర్సీలు ,టోపీల పేరుతో భారీగా దోచేశారన్న ఫిర్యాదులపై…ఇటు విజిలెన్స్, అటు సిఐడి దర్యాప్తు చేస్తున్న వేళ ఉన్నట్టుండి నగరి ఎమ్మెల్యే సిట్ అనడం వెనకున్న ఆంతర్యం ఏంటన్న చర్చ నడుస్తోంది రాజకీయవర్గాల్లో. అయితే… ఈ మాటల వెనక పెద్ద వ్యూహమే ఉండి ఉండవచ్చంటున్నారు పరిశీలకులు. ఓవైపు ఆడుదాం ఆంధ్ర పై విచారణ జరుగుతున్న టైంలోనే… నాకేం కాదన్న ధీమాతో రోజా ఉన్నారని ప్రచారం జరుగుతోంది.
ప్రస్తుతం ముఖ్యమంత్రి కార్యాలయంలో ఉన్న ఓ సీనియర్ ఐఏఎస్ అధికారి వ్యవహారాన్ని తనదాకా రాకుండా చూస్తారన్న ధీమాతోనే మాజీ మంత్రి తిరిగి నోటికి పని చెబుతున్నట్టు మాట్లాడుకుంటున్నాయి టీడీపీ వర్గాలు. గతంలోలాగే ఆమె తిరిగి ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి మీద నోరు పారేసుకుంటున్నారన్న అభిప్రాయం ఉమ్మడి జిల్లా తెలుగుదేశం వర్గాల్లో బలపడుతున్నట్టు చెప్పుకుంటున్నారు.
ఆమె మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో… ఇక లాభం లేదనుకున్న నగరి ఎమ్మెల్యే భానుప్రకాష్ రూట్ మార్చారన్నది ఆయన సన్నిహితవర్గాల సమాచారం. రోజా దూకుడుకు చెక్ పెట్టాలనే ఉద్దేశంతోనే సిట్ దర్యాప్తు అంశాన్ని తెర మీదికి తెచ్చినట్టు చెప్పుకుంటున్నారు.ముఖ్యంగా నగరిలో టిటిడి ఉద్యోగులకు ఇచ్చిన ఇంటి స్థలాల కోసం పాదిరేడు రైతుల దగ్గర తీసుకున్న భూముల్లో దాదాపు యాబైకోట్ల వరకు గోల్మాల్ జరిగిందన్న ఆరోపణలున్నాయి. రైతుల నుంచి రోజా మనుషులు పదిశాతం కమీషన్ వసూలు చేశారని ,ఇందులో అప్పటి టిడిడి చైర్మన్ భూమన కరుణాకర్రెడ్డి, లోకల్ ఎమ్మెల్యేగా ఉన్నరోజాకు పెద్ద మొత్తంలో డబ్బులు ముట్టాయని ఆరోపిస్తున్నారు టీడీపీ నాయకులు. ఇక తన అన్నదమ్ములతో కలిసి దోచుకున్న భూములు, కోసల నగరం 40 ఎకరాల భూమి, తిరుమల దర్శనాలు, బెంజ్ కారు కహానీ, వైజాగ్ లో భూములు, ఏపిఐసిసి చైర్మన్గా ఉన్నప్పుడు చేసిన అక్రమాలు, అప్పుడు పొందిన లబ్ది, విల్లాలు అంటూ…. చాంతాడంత లిస్ట్ చెబుతోంది గాలి భానుప్రకాష్ వర్గం. అందుకే వీటన్నిటి మీద సిట్ దర్యాప్తునకు ఆదేశించాలని ఆయన కోరుతున్నట్టు సమాచారం. ఇవన్నీ చాలవన్నట్టు… పుత్తూరు మున్సిపల్ చైర్మన్ పదవి ఇప్పిస్తానని చెప్పి 40 లక్షల రూపాయలు తీసుకుని రోజా మోసం చేశారంటూ…ఆ వ్యవహారాన్ని కూడా బయట తీస్తున్నారట నగరి తమ్ముళ్ళు. ఇలా… రోజా మీదున్న ఆరోపణలన్నిటినీ మరోసారి ప్రస్తావించి సిట్ దర్యాప్తునకు డిమాండ్ చేయడమేగాక… ఈ ఏడాది కాలంలో నేను ఎవరి దగ్గరన్నా… రూపాయి తీసుకున్నట్టు నిరూపించమంటూ భాను ప్రకాష్ సవాల్ చేయడం మరింత కాక పెంచుతోంది. ఇలా… నగరి ఎమ్మెల్యే వ్యూహంతో రోజా శిబిరంలో కలవరం మొదలైందన్న చర్చ జరుగుతోంది నగరి నియోజకవర్గంలో. ఆయన భయపెట్టడానికి సిట్ దర్యాప్తు డిమాండ్ చేశారా? నిజంగానే… ప్రభుత్వంలో ఆ దిశగా కదలికలు ఉండి….ఎమ్మెల్యే వాటి గురించి ప్రస్తావించారా అంటూ ఆరా తీస్తున్నారట మాజీ మంత్రి అనుచరులు. మొత్తం మీద నగరిలో కొత్తగా సిట్ రాజకీయం సెగలు పుట్టిస్తోంది.