Off The Record: నిజామాబాద్ కారు పార్టీలో కొత్త చిచ్చు
Off The Record: నిజామాబాద్ జిల్లా గులాబీ పార్టీలో కొత్త చిచ్చు రేగుతోందట. పార్టీ అధిష్టానం తీసుకున్న నిర్ణయం నేతల మధ్య మనస్పర్థల్ని పెంచుతోందంటున్నారు. వివిధ అసెంబ్లీ నియోజకవర్గాలకు ఓడిపోయిన మాజీ ఎమ్మెల్యేలు ఇన్ఛార్జ్లుగా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళని కాదని కొత్తగా కో ఆర్డినేటర్స్ని నియమించడం సమస్యకు మూల కారణం అంటున్నాయి స్థానిక పార్టీ వర్గాలు. నిజామాబాద్ అర్బన్, బోధన్, ఆర్మూర్లో పార్టీ దాదాపుగా ఖాళీ అవుతోందట. నాయకులు, కార్యకర్తలు ఇతర పార్టీల్లోకి జంప్ల మీద జంప్లు కొడుతున్నా…. ఇన్ఛార్జ్లుగా ఉన్న మాజీ ఎమ్మెల్యేలు సీరియస్గా తీసుకోవడం లేదని, పైగా కేడర్కు అసలు అందుబాటులో ఉండటం లేదని పార్టీ పెద్దలకు ఫిర్యాదులు వెళ్లిట్టు తెలిసింది. అందుకే వాళ్ళకు సమాంతరంగా కొత్తగా కో ఆర్డినేటర్స్ని నియమించారన్నది ఒక వెర్షన్. మాజీ ఎమ్మెల్యేల్లో ఒకరు విదేశాల్లో ఉంటే, మరొకరు వివాదాల్లో బిజీగా ఉన్నారట. ఇంకొందరు హైదరాబాద్ వదిలి రావడంలేదన్నది కేడర్ మాట.
ఏదో… నియోజకవర్గానికి రాకపోతే బాగుండదన్నట్టుగా గుర్తుకు వచ్చినప్పుడు చుట్టపు చూపుగా వచ్చి వెళ్తున్నారే తప్ప ఎన్నికల ప్రచారాన్ని సీరియస్గా తీసుకోవడం లేదన్నది ప్రధానమైన అభియోగం. దీంతో…. సమన్వయకర్తల రూపంలో ఇన్ఛార్జ్లకు చెక్పెట్టే ఆలోచన చేసిందట హైకమాండ్. ఆ క్రమంలోనే నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లకు సమన్వయకర్తలను ప్రకటించారు. అలాగే నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గ ఇంచార్జ్ బాధ్యతల్ని బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డికి అప్పగించింది అధినాయకత్వం. అయితే కో ఆర్డినేటర్ల దగ్గరే మొత్తం తేడా కొడుతోందన్నది బీఆర్ఎస్ వర్గాల మాట. కో ఆర్డినేటర్స్లో ఆర్మూర్ కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, కోరుట్ల ఎల్ రమణ మినహా మిగతా ఎవ్వరూ పెద్ద స్థాయి నాయకులు కాదని, తాము ఉన్నచోట వాళ్ళ పెత్తనం ఏంటని మండి పడుతున్నారట సీనియర్స్. అదే సమయంలో అంతకు మించిన మరో పెద్ద సమస్య కూడా వస్తున్నట్టు తెలిసింది. సమన్వయకర్తలవల్లే అసలు సమన్వయం అన్నది లేకుండా పోతోందని, అది పార్టీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్కు తలనొప్పులు పెంచుతోందని అంటున్నారు.
Also Read
ఈనెల 19న నామినేషన్ వేశారు గోవర్ధన్. తర్వాత పాత కలెక్టరేట్ మైదానంలో బహిరంగ సభ జరిగింది. అయితే.. ఈ కార్యక్రమానికి జన సమీకరణ బాధ్యత ఎవరిదన్న గందరగోళం వచ్చిందట. ఇన్ఛార్జ్, కో ఆర్డినేటర్లో ఎవరికి బాధ్యత అప్పగించాలో తెలియక తలలు పట్టుకున్నట్టు తెలిసింది. అంతేకాదు… ఖర్చులు ఎవరు భరించాలి? ఎవరి చేతికి డబ్బులు ఇవ్వాలనే విషయంలో కన్ఫ్యూజ్ అయినట్టు తెలిసింది. ఈ కంగాళీ కారణంగా ఎవరూ సరిగా బాధ్యత తీసుకోకపోవడంతో సభకు జనం కూడా ఆశించిన స్థాయిలో రాలేదన్నది పార్టీ వర్గాల సమాచారం. దాంతో… వచ్చిన వాళ్ళతోనే మమ అనిపించారట. దీనికి తోడు సభా వేదికపై సమన్వయ కర్తలకు తగిన ప్రాధాన్యం ఇవ్వలేదంటూ లుకలుకలు మొదలైనట్టు తెలిసింది. నామినేషన్ల పక్రియ పూర్తై.. ప్రచారం ఊపందుకునే సమయంలో పార్టీ అధిష్టానం చేసిన సమన్వయకర్తల ప్రయోగం కొత్త సమస్యలకు తెరలేపిందని గులాబీ వర్గాలే గుసగుసలాడుకుంటున్న పరిస్థితి. దశాబ్దం పాటు ఎమ్మెల్యేలుగా పనిచేసి ఓడిపోయిన నేతలు.. కో ఆర్డినేటర్లతో సమన్వయం చేసుకోలేకపోతున్నారట. మేమేంది… మా సీనియారిటీ ఏంది? మీరా మాకు చెప్పేది.. అంటూ లైట్ తీసుకుంటున్నట్టు తెలిసింది. ఇలా సమన్వయకర్తతోనే సమన్వయం కరువై అసలుకే ఎసరొస్తుందన్న ఆందోళన గులాబీ కేడర్లో పెరుగుతోందంటున్నారు. మరి మార్పు మంచిదా? లేక ముంచేదా అన్న సంగతి తేలాలంటే… మరికొన్ని రోజులు ఆగాల్సిందే.
తాజావార్తలు
-
Air Cooler: రోజుకు 8 గంటలు కూలర్ ఆన్లో ఉంటే ఎంత బిల్లు వస్తుందో తెలుసా?
-
Jabalpur Boat Tragedy: “లైఫ్ జాకెట్” ఉన్నా తల్లి బిడ్డ ఎలా మరణించారు.?
-
Unusual Weather : తెలుగు రాష్ట్రాల్లో భిన్నవాతావరణం… పగలు సెగలు..సాయంత్రం జల్లులు
-
SRH vs KKR IPL 2026: అరుదైన రికార్డు సాధించిన సునీల్ నరైన్.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి ఆటగాడిగా..
-
Donald Trump: జర్మనీకి డబుల్ షాక్ ఇచ్చిన ట్రంప్..
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!