Off The Record: పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గం.. పేరుకు ఎస్సీ రిజర్వుడు అయినా…పోటీ మాత్రం జనరల్ సీట్ లెవల్లో ఉంటుంది. ఈసారి మాత్రం వ్యవహారం కాస్త తేడాగా ఉందట. ఈ నియోజకవర్గం పరిధిలోని ఏడుకు ఏడు అసెంబ్లీ సెగ్మెంట్స్ కాంగ్రెస్ చేతిలోనే ఉన్నాయి. అలాగే ట్రయాంగిల్ వార్లో అదృష్టం కలిసి వస్తుందని ఆశిస్తోంది బీజేపీ. పోగొట్టుకున్న చోటే వెతుక్కోవాలన్న పట్టుదలగా ఉంది బీఆర్ఎస్. మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆ పార్టీ తరపున అభ్యర్థిగా బరిలో దిగారు. 2004 నుంచి 18దాకా ఓటమి లేకుండా గెలిచిన చరిత్ర ఈశ్వర్ది. కేసీఆర్ సెకండ్ కేబినెట్లో మంత్రిగా చేశారాయన. ఇరవై ఏళ్లపాటు ఎమ్మెల్యేగా ఉన్న కొప్పుల ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు. వెంటనే ఎంపీ టిక్కెట్ దక్కినా.. పార్టీ అధిష్టానంతో పాటు ఆయన వేసుకున్న అంచనాలకు, క్షేత్ర స్థాయి వాస్తవాలకు పొంతన లేకుండా ఉందట.ఆ సంగతి దిగాక గానీ.. అర్ధం కాలేదంటున్నారు.
పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల్లో విస్తరించి ఉన్న పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ఒక్క ఎమ్మెల్యే కూడా కార్ పార్టీకి లేకపోవడం, క్యాడర్లో నిరాశ, ఓడిన నేతలపై ప్రజల్లో ఇంకా వ్యతిరేకత ఉండటం లాంటివి ఇబ్బంది పెడుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయాక గులాబీ పార్టీ సెకండ్ క్యాడర్ పెద్ద ఎత్తున హస్తం పార్టీలో చేరిపోయింది. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు కూడా పెద్ద సంఖ్యలో కారు దిగేయడంతో పెద్దపల్లి నియోజకవర్గంలో బీఆర్ఎస్ పరిస్థితి దిక్కూ దివాణం లేనట్టుగా తయారైందని అంటున్నారు పరిశీలకులు. ప్రచారంలో మాజీ ఎమ్మెల్యేలు సైతం కొప్పులకు అంతగా సహకరించడం లేదన్నది పార్టీ వర్గాల మాట. దీంతో మిగిలి ఉన్న శ్రేణులను పట్టించుకునే నాధుడు లేకుండా పోయాడన్న ఆవేదనలో ఉన్నారట కార్యకర్తలు. కొందరు నేతలు సోషల్ మీడియాకే పరిమితమై ఆహా.. ఓహో అంటున్నారే తప్ప జనంలోకి వెళ్లడం లేదని బాహాటంగా చెప్తున్నారు కార్యకర్తలు. పోలింగ్ సమయం దగ్గర పడుతున్నప్పటికీ మాజీ ఎమ్మెల్యేలు.. నియోజకవర్గ స్థాయి నేతల్లో ఆశించిన కదలిక లేదట.. ఆయా నియోజకవర్గాలలో క్యాడర్ను సమాయత్త పరిచేందుకు ఈశ్వరే స్వయంగా వెళ్లాల్సి రావడం, ఇతర నాయకులెవరూ సీరియస్గా లేకపోవడం ఇబ్బందికరంగా మారిందంటున్నారు.
ఇక, కొన్నిచోట్ల అయితే… అధికారంలో ఉన్నంత కాలం, మంత్రిగా ఉండి కూడా తమను పట్టించుకోలేదని, ఇప్పుడు ఎలా వచ్చారంటూ కార్యకర్తలు మొహం మీదే అడగడం కొప్పులకు ఇబ్బందిగా మారిందని అంటున్నారు. బూత్ లెవల్లో పనిచేయాల్సిన వారే ఇంత అసంతృప్తితో ఉంటే ఎన్నికలను ఎలా ఎదుర్కోవాలనే ఆలోచనలో పడ్డారట ఎంపీ అభ్యర్థి… మరోవైపు ఇటీవల ఓడిన ఎమ్మెల్యేలు తన వెంట వస్తే కొద్దో గొప్పో మిగిలిన సానుభూతి కూడా పోయేలా ఉందని గ్రహించారట కొప్పుల. వాళ్ళు కూడా ప్రచారంపై అంతగా ఆసక్తి చూపకపోవడంతో… రోగి కోరుకున్నది, డాక్టర్ రాసింది ఒకే మందు అన్నట్టుగా ఉందట వ్యవహారం. పారిశ్రామిక ప్రాంతం కావడంతో కార్మిక నేతగా తనకున్న ఇమేజ్ ని వాడుకుని గ్రామాల్లో ఉన్న లోటును ఇక్కడ భర్తీ చేద్దామనుకుంటే… అక్కడా పరిస్థితి ఏమంత ఆశాజనకంగా లేదని తెలిసింది. ఎన్నికల ముందు పార్టీ పెద్దల దగ్గర అవమానపడ్డ టీబీజీకేఎస్ అగ్రనేతలు ఈశ్వర్తో అంటీ ముట్టనట్టుగానే ఉంటున్నారట. తన వ్యక్తిగత సంబంధాలతో ఈశ్వర్ వారి వద్దకు వెళ్లినా.. కనీస స్పందన కూడా ఉండటం లేదని తెలిసింది. అత్యంత కీలకమైన కోల్బెల్ట్ ఏరియాలో ఎవ్వరూ తనను పట్టించుకోకపోవడం, పాత పరిచయాలు కూడా పెద్దగా వర్కౌట్ అవుతాయన్న నమ్మకం లేకపోవడంతో… కొప్పులకు కంగారు మొదలైందన్న చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. ఆయన రాష్ట్ర మంత్రి అయ్యాక కూడా ఎవ్వర్నీ పట్టించుకోలేదన్న అసహనం ఎక్కువగా ఉన్నట్టు తెలిసింది. ఎన్నో వ్యూహాలతో బరిలోకి దిగితే… తానొకటి తలిస్తే దైవం మరోటి తలచాడు అన్నట్టుగా తయారైందట ఆయన పరిస్థితి. అటు కాంగ్రెస్ పార్టీకి ఉన్న పాజిటిట్ వేవ్కు తోడు ఆ పార్టీ నుంచి బలమైన అభ్యర్థి ఎమ్మెల్యే వివేక్ కుమారుడు వంశీ కృష్ణ బరిలో ఉన్నారు. ఈ పరిస్థితుల్లో గెలవడం సంగతి అటుంచితే… గౌరవప్రదమైన ఓట్లతో బయటపడతామా అన్న డౌట్స్ కొప్పుల ఈశ్వర్ వర్గంలో పెరుగుతున్నట్టు స్థానికంగా ప్రచారం జరుగుతోంది. కష్టకాలంలో పార్టీని కాపాడేందుకు రంగంలోకి దిగిన కొప్పుల గులాబీ కోటను నిలబెడతారా…? లేక బలవుతారా అన్నది చూడాలంటున్నారు పరిశీలకులు.