Off The Record: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఒకప్పుడు కంచుకోట నెల్లూరు రూరల్ అసెంబ్లీ నియోజకవర్గం. ఇక్కడి నుంచే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆ పార్టీ తరపున రెండు సార్లు ఎమ్మెల్యే అయ్యారు. కానీ… గత ఎన్నికల్లో ఆయన పార్టీ మారి తెలుగుదేశం తరపున పోటీ చేసి గెలిచారు. దీంతో… నియోజకవర్గ ఇన్చార్జిగా ఆనం విజయకుమార్ రెడ్డికి బాధ్యతలు అప్పగించింది ఫ్యాన్ అధిష్టానం. నియోజకవర్గంలో కేడర్ చేజారకుండా సమన్వయం చేసుకోవాలన్నది పార్టీ పెద్దలు ఆయనకు ఇచ్చిన ముఖ్యమైన టాస్క్. కానీ… ఆ పనిలో ఆయన విఫలమయ్యారన్నది పార్టీ ఇంటర్నల్ టాక్. ముఖ్యంగా ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి దూకుడు తగ్గట్టుగా వ్యవహరించలేకపోతున్నట్టు చెబుతున్నారు. దీంతో… వైసీపీ వెనుకబడిందన్న ప్రచారం గట్టిగా జరుగుతోంది. రూరల్ ఇన్చార్జ్ బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి విజయ్కుమార్రెడ్డి కొన్ని వర్గాలను దూరం పెడుతూ వచ్చారట. దీంతో వారందరూ అధినేతకు ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. తమను కార్యక్రమాలకు పిలవడం లేదని, అత్యవసరంలో కనీసం ఫోన్ కూడా లిఫ్ట్ చేయడం లేదని మొర పెట్టుకున్నారట. మరీ ముఖ్యంగా ఆదాల అనుచరులను అస్సలు పట్టించుకోవడం లేదని, వెంటనే ఇన్ఛార్జ్ను మార్చాలని కోరినట్టు సమాచారం. ఆనం ఇన్ఛార్జ్ గా ఉంటే రూరల్లో గెలవడం కష్టమని కూడా కొందరు నేతలు జగన్ ముందు కుండబద్దలు కొట్టేశారట. అయితే…విజయ్ కుమార్ రెడ్డితో ఇబ్బంది లేకుండా చేస్తానని, అంతా పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలని అసంతృప్త నేతల్ని జగన్ ఆదేశించినట్టు చెబుతున్నారు.
ఇక రాష్ట్రవ్యాప్తంగా పార్టీ వెనుకబడిన నియోజకవర్గాల సమీక్షలో భాగంగా రూరల్ ఇన్ఛార్జ్ ఆనం విజయకుమార్ రెడ్డితో పాటు.. నెల్లూరు జిల్లా అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డిను కూడా పిలిపించి జగన్ మాట్లాడారట. ఇటీవల నిర్వహించిన సర్వేలో.. ఆనం విజయకుమార్ రెడ్డి వెనుకంజలో ఉన్నారని, పనితీరును మార్చుకోవాలని ఆదేశించినట్టు తెలిసింది. కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ కూడా ఎందుకు పార్టీని బలోపేతం చేయలేకపోతున్నారంటూ ప్రశ్నించారన్నది ఇంటర్నల్ టాక్. రూరల్లో ప్రత్యర్థి బలాన్ని అంచనా వేసుకుని కార్యక్రమాలు చెయ్యాలని సూచించారట. మరో ఆరు నెలల్లో ఇంకో సర్వే చేయిస్తామని, ఆలోపు పరిస్థితులు మారకపోతే కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుందని కూడా వార్నింగ్ ఇచ్చినట్టు చెప్పుకుంటున్నారు. ఇదే సమయంలో నేతల మధ్య ఉన్న గ్యాప్ ఫిల్ చేయమని జిల్లా అధ్యక్షులు కాకానిని జగన్ ఆదేశించారట.
ఆ తర్వాత విజయకుమార్ రెడ్డికి దూరంగా ఉన్న కీలక నేతలను పిలిపించుకుని కాకాని మాట్లాడారట. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని దీటుగా ఎదుర్కోవాలంటే.. అదే సామాజిక వర్గానికి చెందిన నేతే బరిలో ఉండాలనేది అధిష్ఠానం ఆలోచన అని, కాబట్టి ఇన్ఛార్జ్ మార్పు ఉండబోదని కూడా క్లారిటీ ఇచ్చేశారట. ఇక విజయ్ కుమార్ రెడ్డి కూడా అసంతృప్త నేతలతో మాట్లాడరట. దీంతో… ప్రస్తుతానికి తిరిగి అంతా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నట్టు చెబుతున్నారు. మరోవైపు కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత.. నెల్లూరు రూరల్ వైసీపీ నేతలు కొందరు టీడీపీలో చేరారు. మరి కొందరు వ్యాపారాల పేరుతోబయటికి వెళ్లిపోయారు. అటు ఇన్ఛార్జ్ కూడా కొందరు సీనియర్ కార్పొరేటర్లను దూరం పెడుతూ వచ్చారు. ఐతే జగన్ ఇచ్చిన స్ట్రోక్తో ఆనం సెట్ అయినట్టు కనిపిస్తోందంటున్నారు. పార్టీకి దూరంగా ఉంటున్న వారిని దగ్గరికి తీసే ప్రయత్నంలో ఉన్నారట ఆయన. వాయిస్ పెంచడం కూడా అధిష్టానం హెచ్చరికల్లో భాగమేనన్న విశ్లేషణలున్నాయి. తమ్ముడూ… నీకు నేనే పోటీ.. రూరల్కి ఇంకెవరూ రారంటూ విజయ్ కుమార్ రెడ్డి ఇటీవల కోటంరెడ్డి సోదరులను ఉద్దేశించి పంచ్లు విసరడం కూడా కేడర్కి ఉత్సాహాన్నిచ్చిందని అంటున్నారు. మొత్తంగా జగన్ ఇచ్చిన వార్నింగ్ వర్క్ అవుట్ అవ్వడంతో పాటు.. ఆయన ఇచ్చిన భరోసా తోనే విజయ్ కుమార్ రెడ్డి దూకుడుగా వ్యవహరిస్తున్నారనేది ఫ్యాన్ పార్టీలో జరుగుతున్న తాజా చర్చ..

