KC Venugopal: మణిపూర్ నుంచి జనవరి 14న రాహుల్ గాంధీ భారత్ న్యాయ యాత్ర చేస్తున్నట్లు కాంగ్రెస్ ప్రకటించింది. కానీ మణిపూర్ సర్కార్ మాత్రం కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇస్తూ పర్మిషన్ ఇవ్వడం కుదరదని తేల్చి చెప్పింది. భారత్ జోడో న్యాయ్ యాత్రకు ప్రారంభ వేదికకు అనుమతి నిరాకరణపై ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ స్పందించారు. మణిపూర్ కాంగ్రెస్ అధ్యక్షుడు వారం రోజుల క్రితం అనుమతి కోసం చీఫ్ సెక్రటరీకి లేఖ ఇచ్చారు.. ఐదు రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. మూడు రోజుల క్రితం స్వయంగా రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడే ఆయనను కలవడానికి వెళ్లారు.. ఇంఫాల్ ప్యాలెస్ గ్రౌండ్లో అనుమతి ఇవ్వడం లేదని ఈరోజు సమాచారం వచ్చింది అని కేసీ వేణుగోపాల్ వెల్లడించారు.
ఇవాళ ఉదయం కాంగ్రెస్ కు చెందిన మణిపూర్ మాజీ సీఎం ప్రస్తుత ముఖ్యమంత్రిని కలవడానికి వెళ్లి అభ్యర్థించారు.. కానీ ఆయన నిరాకరించారు అని కేసీ వేణుగోపాల్ తెలిపారు. మేం ఎలాంటి డ్రామా సృష్టించడం లేదు.. ఈ యాత్ర దేశం కోసమే.. ప్యాలెస్ గ్రౌండ్ ఇవ్వకుంటే ఇబ్బంది లేదు, మరో స్థలాన్ని ఎంచుకుంటాం, ఈ విషయమై అక్కడి సీఎంతో కూడా మాట్లాడాం.. భారత్ జోడో న్యాయ్ యాత్ర ఇంఫాల్ నుంచే ప్రారంభమవుతుంది.. రేపటిలోగా అందరికీ కొత్త ప్రదేశానికి సంబంధించిన సమాచారం అందజేస్తాం అని ఆయన పేర్కొన్నారు.