Nithin Gadkari: కేంద్రమంత్రి నితిన్ గడ్కరీకి బెదిరింపు కాల్స్ వచ్చాయి. ఆయన ఆఫీస్కు గుర్తు తెలియని వ్యక్తి బెదిరింపు కాల్స్ చేయడం తీవ్ర కలకలం రేపింది. రూ.10 కోట్లు ఇవ్వకుంటే చంపేస్తామంటూ గుర్తు తెలియని వ్యక్తి మూడు సార్లు కాల్స్ చేశాడు. మంగళవారం మహారాష్ట్రలోని నాగ్పూర్లో ఉన్న కేంద్ర మంత్రి గడ్కరీ కార్యాలయానికి మూడు సార్లు కాల్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. గడ్కరీ కార్యాలయ సిబ్బంది సమాచారంతో అప్రమత్తమైన పోలీసులు నాగపూర్లోని ఇల్లు, ఆఫీస్ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
Read Also: Arvind Kejriwal: పని చేయనివ్వండి.. ఢిల్లీ బడ్జెట్ను అడ్డుకోవడంపై కేంద్రంపై కేజ్రీవాల్ దాడి
ఈ ఘటనకు సంబంధించి దర్యాప్తు చేపట్టిన పోలీసులు కాలర్ను జయేష్ పూజారిగా గుర్తించారు. తన డిమాండ్ను నెరవేర్చకుంటే బాంబుతో మంత్రికి హాని తలపెడతానని అతడు బెదిరించాడు. జయేష్ పూజారి హిందల్గ జైలు ఖైదీ అని, గతంలో ఓ హత్య కేసులో కోర్టు అతడికి మరణ శిక్ష విధించిందని దర్యాప్తులో వెల్లడైంది. మంగళవారం ఉదయం రెండు సార్లు.. మధ్యాహ్నం ఒకసారి ఫోన్ చేసి రూ. 10 కోట్లు డిమాండ్ చేశాడని.. ఇవ్వకపోతే చంపేస్తానని బెదిరించాడని నాగ్పూర్ రెండో జోన్ డిప్యూటీ సీపీ రాహు మాడనే తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు.. కాల్ వచ్చిన నంబర్ను మంగళూరులోని ఓ మహిళకు చెందినదిగా గుర్తించారు. అయితే, ఈ కాల్ ఆ మహిళే చేసిందా?.. లేదా జయేశ్ పూజారి అనే వ్యక్తి చేశాడా? అనే విషయంపై విచారణ చేపట్టారు. జయేశ్ పూజారి.. ఓ మర్డర్ కేసులో యావజ్జీవ శిక్ష అనుభవిస్తున్న ఖైదీ అని తెలిసింది. దీనిపై అతడిని విచారించగా, తనకూ.. ఈ బెదిరింపు కాల్స్కు ఎలాంటి సంబంధం లేదని చెప్పాడు. ఆ కాల్స్ చేసిన వ్యక్తి ఎవరో, ఎక్కడి నుంచి చేస్తున్నాడో అనే విషయాలు ఇంకా తెలియాల్సి ఉంది. నితిన్ గడ్కరీకి జనవరి 14న కూడా ఇలాంటి బెదిరింపు కాల్స్ వచ్చాయి.