ఇరాన్తో యుద్ధంలోకి అమెరికాను తాము నెట్టలేదని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు అన్నారు. నెతన్యాహు మరణించారంటూ గత కొద్దిరోజులుగా విస్తృతంగా ప్రచారం సాగుతోంది. ఈ వదంతులు నేపథ్యంలో తొలిసారి నెతన్యాహు మీడియా ముందుకు వచ్చారు. ఇరాన్తో యుద్ధం విషయంలో ట్రంప్తో ఇజ్రాయెల్ సమన్వయం అద్భుతంగా ఉందని.. ఆయన తన నిర్ణయాలు తానే తీసుకుంటారని.. ఇరాన్ యుద్ధం విషయంలో కూడా అదే జరిగిందని పేర్కొన్నారు. 20 రోజుల యుద్ధంలో ఇరాన్ అణుశక్తిని నాశనం చేశామని.. లక్ష్యం సరైన దిశలోనే సాగుతోందని ధీమా వ్యక్తం చేశారు. ఇప్పటికే యుద్ధంలో ఇరాన్ భారీ నష్టాలను చవిచూసిందని స్పష్టం చేశారు. ఇరాన్తో యుద్ధం.. ప్రజలు అనుకుంటున్న దానికంటే వేగంగా ముగియవచ్చని.. ఈ విషయాన్ని తాను నమ్ముతున్నట్లు నెతన్యాహు పేర్కొన్నారు.
ప్రస్తుతం ఇరాన్ను ఎవరు పాలిస్తున్నారో తనకు కచ్చితంగా తెలియదని.. ఖమేనీ స్థానంలో నియమితులైన మోజ్తాబా ఇంకా కనిపించలేదని.. మనం చూస్తున్నదేమిటంటే అగ్రస్థానం కోసం పోటీ పడుతున్న వర్గాల్లో అంతర్గతంగా చాలా కలహాలు నెలకొని ఉన్నాయని తెలిపారు. ప్రభుత్వంలో చీలికలను గమనిస్తున్నామని.. వాటిని వీలైనంత వేగంగా వ్యాప్తి చేయడానికి ప్రయత్నిస్తున్నామన్నారు. కేవలం ఉన్నతాధికారులలోనే కాదు.. క్షేత్రస్థాయిలో కూడా చీలికలు గమనించినట్లు తెలిపారు.
ఇక యుద్ధంలో ఇజ్రాయెల్ గెలిచిందని.. ఇరాన్ నాశనం అయిందని తెలిపారు. ఇకపై ఇరాన్ యురేనియంను సుసంపన్నం చేయలేదని.. బాలిస్టిక్ క్షిపణులను కూడా నిర్మించలేదని తెలిపారు. ఇజ్రాయెలే అమెరికాను యుద్ధంలోకి లాగింది అనే విషయాన్ని నెతన్యాహు ఖండించారు. ‘‘అధ్యక్షుడు ట్రంప్కు ఏమి చేయాలో ఎవరైనా చెప్పగలరని నిజంగా ఎవరైనా అనుకుంటున్నారా?.’’ అని ప్రశ్నించారు. ఇరాన్ గ్యాస్ క్షేత్రంపై ఇజ్రాయెల్ తనంతట తానుగా దాడి చేసిందని.. దీనికి ప్రతీకారంగా టెహ్రాన్ ఖతార్ ప్రధాన గ్యాస్ కేంద్రంపై దాడి చేసిందని నెతన్యాహు అన్నారు. ఇరాన్ గ్యాస్ కాంపౌండ్పై ఇజ్రాయెల్ ఒంటరిగానే దాడి చేసిందని.. అయితే భవిష్యత్ దాడులను నిలిపివేయమని అధ్యక్షుడు ట్రంప్ మమ్మల్ని కోరారన్నారు.
ఇరాన్లోని మృత్యు సంస్కృతి, కీలకమైన అంతర్జాతీయ సముద్ర మార్గమైన హార్ముజ్ జలసంధిని మూసివేసి ప్రపంచాన్ని బ్లాక్మెయిల్ చేయడానికి ప్రయత్నిస్తోందని.. అది ఫలించదని ఇరాన్ను నెతన్యాహు హెచ్చరించారు.