పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధం కారణంగా దేశవ్యాప్తంగా వంట గ్యాస్ కొరత ఏర్పడిన నేపథ్యంలో హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. చమురు శుద్ధి సంస్థలు ఎల్పీజీని అంతర్జాతీయ మార్కెట్లో విక్రయించడానికి వీల్లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు కాన్ఫిడెన్స్ పెట్రోలియం ఇండియా లిమిటెడ్కు ఆదేశాలు జారీ చేసింది. దేశంలో ఎల్పీజీ కొరత ఉన్న సమయంలో చమురు శుద్ధి సంస్థలు అంతర్జాతీయ మార్కెట్లో విక్రయాలకు పాల్పడితే.. అది సామాన్య ప్రజలకు తీరని నష్టంతో పాటు కష్టాలను కలిగిస్తుందని కోర్టు స్పష్టం చేసింది. వినియోగదారులకు వంట గ్యాస్ సరఫరా చేసేందుకు వీలుగా గ్యాస్ను పంపిణీదారులకు మాత్రమే సరఫరా చేయాలని ఆదేశించింది.
Also Read: Today Astrology: శుక్రవారం దిన ఫలాలు.. ఈ రాశుల వారికి ధనయోగం పక్కా!
దేశంలోని చమురు శుద్ధి కర్మాగారాలు ప్రొపేన్, బ్యూటేన్ నిల్వలను గరిష్టంగా ఎల్పీజీ ఉత్పత్తి కోసం ఉపయోగించడంతో పాటు ఉత్పత్తి చేసిన ఎల్పీజీని ప్రభుత్వ రంగ సంస్థలైన ఐఓసీఎల్, హెచ్పీసీఎల్, బీపీసీఎల్లకు అందుబాటులో ఉంచి.. దానిని కేవలం దేశీయ వినియోగదారులకు మాత్రమే సరఫరా చేయాలంటూ ఈ నెల 5న జారీ చేసిన స్వీయ ఉత్తర్వుల కఠిన అమలుకు చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ వ్యవహారంలో కౌంటర్లు దాఖలు చేయాలని కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ, కాన్ఫిడెన్స్ పెట్రోలియం ఇండియా లిమిటెడ్లను ఆదేశించింది. ఇందులో భాగంగా వారికి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఏప్రిల్ 2కు వాయిదా వేసింది.