Nepal Floods: నేపాల్‌లో చిక్కుకున్న ఏపీ యాత్రికులపై మంత్రి లోకేష్ సమీక్ష.. ముగ్గురి ఆచూకీ కోసం ముమ్మర ప్రయత్నాలు!

Nara Lokesh

Nara Lokesh

నేపాల్‌లో మెరుపు వరదల్లో చిక్కుకున్న ఆంధ్రప్రదేశ్‌కు చెందిన యాత్రికుల క్షేమ సమాచారంపై మంత్రి నారా లోకేష్ ప్రత్యేకంగా సమీక్షిస్తున్నారు. వరదల్లో చిక్కుకున్న ఏడుగురు ఏపీ యాత్రికుల పరిస్థితిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. వీరిలో నలుగురు సురక్షితంగా ఉన్నారని, మరో ముగ్గురి ఆచూకీ ఇంకా లభించలేదని ఏపీ ఢిల్లీ భవన్ అధికారులు మంత్రికి వివరించారు. ఆచూకీ లభించని ముగ్గురిలో కుప్పం ప్రాంతానికి చెందిన బాల సుబ్రహ్మణ్యం, ఈషా ఫౌండేషన్ గ్రూప్‌కు చెందిన శశికుమార్‌, రాజ్యలక్ష్మి ఉన్నట్లు అధికారులు తెలిపారు. వీరి ఆచూకీ కనుగొనేందుకు కేంద్ర ప్రభుత్వంతో నిరంతరం సమన్వయం చేసుకుంటూ చర్యలు ముమ్మరం చేయాలని మంత్రి లోకేష్ అధికారులను సూచించారు.

ఈషా ఫౌండేషన్‌కు చెందిన శశికుమార్‌ చివరిసారిగా చైనాలోని గైరోంగ్ ఎంబసీ వద్ద కనిపించినట్లు అధికారులు వెల్లడించారు. ఆయనను గుర్తించేందుకు చైనా, నేపాల్ అధికారులతో సమన్వయం కొనసాగించాలని మంత్రి నారా లోకేష్ ఆదేశించారు. కైలాస మానస సరోవర యాత్రకు వెళ్లి వరదల్లో చిక్కుకున్న కర్నూలు జిల్లాకు చెందిన భాస్కర్ శాస్త్రి సహా మరో ముగ్గురు యాత్రికులు క్షేమంగా ఉన్నారు. సురక్షితంగా ఉన్న యాత్రికులను వీలైనంత త్వరగా అక్కడి నుంచి తరలించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని లోకేష్ అధికారులను ఆదేశించారు. యాత్రికుల భద్రతపై భారత రాయబార కార్యాలయంతో పాటు చైనా, నేపాల్ ఎంబసీలు, గైరోంగ్ ఇమ్మిగ్రేషన్ సెంటర్‌, ఈషా ఫౌండేషన్ ప్రతినిధులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ తాజా సమాచారాన్ని సేకరించాలని మంత్రి సూచించారు. ఆచూకీ లభించని ముగ్గురి కోసం ప్రత్యేకంగా సమన్వయ చర్యలు కొనసాగించాలని చెప్పారు.

మరోవైపు నేపాల్‌లో చిక్కుకున్న యాత్రికులతో పాటు మానస సరోవర యాత్రకు వెళ్లిన ఏపీ వాసుల సమాచారం సేకరణను ఆర్టీజీఎస్ అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. మంత్రి నారా లోకేష్ సూచనల మేరకు ఆర్టీజీఎస్ కేంద్రం నుంచి పరిస్థితిని ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తున్నట్లు ఐటీ సెక్రటరీ కాటంనేని భాస్కర్ తెలిపారు. నేపాల్‌ వరదల నేపథ్యంలో ఏపీ యాత్రికుల భద్రతపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. సురక్షితంగా ఉన్న వారిని స్వస్థలాలకు తీసుకురావడంతో పాటు, ఆచూకీ లభించని ముగ్గురి జాడ కనుగొనే వరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విభాగాల మధ్య సమన్వయంతో సహాయక చర్యలు కొనసాగనున్నాయి.