Nara Lokesh: మంత్రి నారా లోకేష్ పర్యటన.. ఎమ్మెల్యేను అవమానించారంటూ జన సైనికుల ఆందోళన!

  • అదికవి నన్నయ యూనివర్సిటీలో మంత్రి నారా లోకేష్ పర్యటన
  • జనసేన ఎమ్మెల్యేను అవమానించారంటూ జన సైనికులు ఆందోళన
  • జనసేన కార్యకర్తలను సముదాయించిన ఎమ్మెల్యే బత్తుల
Nara Lokesh

Nara Lokesh

రాజమండ్రి అదికవి నన్నయ యూనివర్సిటీలో మంత్రి నారా లోకేష్ పర్యటన సందర్భంగా స్థానిక జనసేన ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణను అవమానించారంటూ జన సైనికులు ఆందోళనకు దిగడంతో ఉద్రిక్తత ఏర్పడింది. యూనివర్సిటీ గేట్ బయట కట్టిన తమ ఫ్లెక్సీలు తొలగింపుతో జనసైనికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పర్యటనలో పాల్గొనేందుకు వచ్చిన జనసేన మహిళా నేత, ఎమ్మెల్యే బత్తుల సతీమణి వెంకట లక్ష్మిని యూనివర్సిటీ నిర్వాహకులు అడ్డుకోవడంతో వివాదం అయ్యింది. బత్తుల బలరామకృష్ణ భార్యను మెడపై చేయి పెట్టి తోసేసారని జన సైనికులు వీర మహిళలు మండిపడ్డారు.

నారా లోకేష్ కార్యక్రమం కాసేపట్లో జరుగుతుందనగా ఈ గొడవ జరిగింది. జన సైనికులకు ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ సద్ది చెప్పారు. కూటమి కోసం అవమానాలు భరించేందుకు సిద్ధంగా ఉన్నామని, రాజానగరం జనసేన ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ ఈ సందర్భంగా అన్నారు. యూనివర్సిటీ ఉద్యోగి ఒకరు రాజానగరం పోలీసుస్టేషన్లో ఈ ఘటనపై ఫిర్యాదు చేశారు. ఎమ్మేల్యే మాత్రం మంత్రి పర్యటనకు ఎటువంటి ఆటంకం కలగకూడదని, తర్వాత ఈ వివాదానికి సంబంధించి చర్యలు తీసుకుందాం అంటూ జనసేన కార్యకర్తలను సముదాయించారు.