Nara Lokesh on AP Local Boy Elections: ఏపీ క్యాబినెట్ సమావేశానికి ముందు టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి నారా లోకేష్ పార్టీకి చెందిన మంత్రులతో బ్రేక్ఫాస్ట్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక సంస్థల ఎన్నికలు, కొత్త పింఛన్లు, ప్రభుత్వ శాఖల పనితీరు, రైతులు-ప్రజల సమస్యలు, పార్టీ కార్యక్రమాలపై మంత్రులకు పలు కీలక సూచనలు చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ అక్టోబర్ నెల నుంచి దశల వారీగా కొత్త పింఛన్లు అందించేలా చర్యలు తీసుకోవాలని లోకేష్ సూచించారు. అదే సమయంలో స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ శ్రేణులంతా సిద్ధంగా ఉండాలని, అన్ని స్థానాల్లో కూటమి అభ్యర్థులను గెలిపించేందుకు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.
స్థానిక సంస్థల ఎన్నికలను అక్టోబర్ లోగా పూర్తి చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని నారా లోకేష్ పేర్కొన్నారు. ఎన్నికలు వాయిదా పడే ప్రసక్తే లేదని స్పష్టం చేసిన ఆయన.. కోర్టుల్లో పెండింగ్లో ఉన్న అంశాలను కూడా త్వరితగతిన పరిష్కరించి అన్ని స్థానాల్లో ఎన్నికలు నిర్వహించేలా ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. తొలుత పురపాలక సంస్థల ఎన్నికలు, ఆ తర్వాత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు.. చివరగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందని లోకేష్ వివరించారు. స్థానిక ఎన్నికలు వాయిదా పడితే ఫైనాన్స్ కమిషన్ నిధులు నిలిచిపోయి రాష్ట్రానికి నష్టం కలిగే ప్రమాదం ఉందని చెప్పారు.
ఎన్నికలు వాయిదా వేయాలని ప్రతిపక్షాలు చేస్తున్న ప్రయత్నాలు ఫలించవని నారా లోకేష్ పేర్కొన్నారు. పెండింగ్ కేసులను త్వరగా పరిష్కరించుకుని అనుకున్న సమయానికి ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. విద్యాశాఖను లక్ష్యంగా చేసుకుని ప్రత్యర్థులు చేస్తున్న ఆరోపణలు, ప్రచారాలపై మంత్రులు అప్రమత్తంగా ఉండాలని లోకేష్ సూచించారు. విద్య, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, సంక్షేమ శాఖలు నిరంతరం అప్రమత్తంగా ఉంటూ తప్పుడు ప్రచారాలను సమర్థంగా తిప్పికొట్టాలని సూచించారు.
మంత్రికి, శాఖకు చెడ్డపేరు వచ్చేలా కొందరు అధికారుల పనితీరు ఉంటే ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవడంలో వెనుకాడబోమని మంత్రి లోకేష్ హెచ్చరించారని తెలుస్తోంది. ఒకరిద్దరు అధికారుల నిర్లక్ష్య వైఖరి కారణంగానే ఇటీవల కొన్ని సమస్యలు తలెత్తాయని, ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వైద్య రంగంలో చిన్న పొరపాటు జరిగినా సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని ట్రోలింగ్ జరుగుతోందని లోకేష్ పేర్కొన్నారు. అందువల్ల సంబంధిత మంత్రులు, అధికారులు తమ శాఖలపై నిరంతరం పర్యవేక్షణ ఉంచాలని సూచించారు.
సెప్టెంబర్ 9న పార్టీ అధినేతపై జరిగిన పరిణామాలను ప్రజలకు గుర్తు చేసేలా ప్రత్యేక కార్యక్రమం నిర్వహించాలని నారా లోకేష్ సూచించినట్లు సమాచారం. గతంలో ఎదురైన సవాళ్లను అధిగమిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న ప్రభుత్వ ప్రస్థానాన్ని ప్రజలకు వివరించేలా కార్యక్రమాన్ని రూపొందించాలని సూచించారు. ఎల్నినో ప్రభావంతో నీటి కొరత ఏర్పడే అవకాశం ఉన్నందున ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించారు. నీటి పొదుపు చర్యలను పటిష్టంగా అమలు చేసి భవిష్యత్లో ఎదురయ్యే ఇబ్బందులను అధిగమించేందుకు ఇప్పటి నుంచే సిద్ధం కావాలని మంత్రులకు సూచించారు.

