కాకినాడ జిల్లా కిర్లంపూడిలో మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం నివాసం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తన తండ్రి ముద్రగడ పద్మనాభంకు కడసారి నివాళులు అర్పించేందుకు వచ్చిన కుమార్తె క్రాంతిని పోలీసులు, ముద్రగడ అనుచరులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. ‘గో బ్యాక్ క్రాంతి’ అంటూ అనుచరులు పెద్ద ఎత్తున నినాదాలు చేయడంతో.. అక్కడ కొంతసేపు ఉద్రిక్త వాతావరణం కొనసాగింది. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ముద్రగడ, క్రాంతి మధ్య రాజకీయ, వ్యక్తిగత విభేదాలు నెలకొన్నాయి. ఆ విభేదాల ప్రభావంతోనే ఇప్పుడు కిర్లంపూడిలో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి.
తండ్రి ముద్రగడ పద్మనాభంకు నివాళులు అర్పించేందుకు కిర్లంపూడికి బయలుదేరిన క్రాంతిని మొదట ప్రత్తిపాడు వద్ద పోలీసులు ఆపేశారు. కుటుంబ సభ్యుల విజ్ఞప్తి మేరకే ఆమెను అడ్డుకున్నామని పోలీసులు తెలిపారు. గతంలో తనకు, కుమార్తెకు మధ్య ఏర్పడిన విభేదాల నేపథ్యంలో తాను మరణిస్తే క్రాంతి రావద్దని ముద్రగడ చెప్పినట్లు కుటుంబ సభ్యులు పేర్కొన్నారని పోలీసులు వెల్లడించారు. అయితే తండ్రిని చివరిసారైనా చూసేందుకు అనుమతించాలని క్రాంతి భావోద్వేగంతో పోలీసులను వేడుకుంది. ఆమె విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న పోలీసులు.. నివాళులు అర్పించేందుకు పరిమిత అనుమతి ఇచ్చారు. నివాళులు అర్పించిన వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోవాలని సూచించారు.
ముద్రగడ నివాసం వద్దకు చేరుకున్న క్రాంతిని ముద్రగడ అనుచరులు అడ్డుకున్నారు. ‘గో బ్యాక్ క్రాంతి’ అంటూ నినాదాలు చేశారు. కొందరు అనుచరులు ముద్రగడ మరణానికి క్రాంతే కారణమంటూ ఆరోపణలు చేస్తూ నినాదాలు చేయడంతో.. పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. ఈ పరిణామాల మధ్య భావోద్వేగానికి గురైన క్రాంతి.. తన తండ్రిని ఒక్కసారి చూడనివ్వాలని కన్నీటి పర్యంతమైంది. అనంతరం పోలీసుల భద్రత మధ్య ఆమె ముద్రగడ పద్మనాభంకు నివాళులు అర్పించింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి.. నివాళుల అనంతరం క్రాంతిని అక్కడి నుంచి తరలించారు.

