ACA President: ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎంపీ కేశినేని చిన్ని ఏకగ్రీవ ఎన్నిక

  • ఏసీఏ అధ్యక్షుడిగా ఎంపీ కేశినేని చిన్ని ఏకగ్రీవ ఎన్నిక
  • తొలి నిర్ణయంగా వరద బాధితుల కోసం రూ.కోటి విరాళం అందజేస్తామని ప్రకటన
Kesineni Chinni

Kesineni Chinni

ACA President: ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్(ఏసీఏ) అధ్యక్షుడిగా ఎంపీ కేశినేని చిన్ని ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఏసీఏ జనరల్ మీటింగ్‌లో అధ్యక్షుడిగా ఎంపీ కేశినేని శివ‌నాథ్ ప్యానల్ ఎన్నికైనట్లు రిటర్నింగ్ అధికారి నిమ్మగడ్డ రమేష్ ప్రకటించారు. ఉపాధ్యక్షుడిగా వెంకట ప్రశాంత్, ఏసీఏ కార్యదర్శిగా సానా సతీష్, జాయింట్ సెక్రటరీగా విష్ణుకుమార్ రాజు, కోశాధికారిగా దండమూడి శ్రీనివాస్, కౌన్సిలర్‌గా గౌరు విష్ణుతేజ్ ఎన్నిక‌య్యారు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఏకగ్రీవంగా ఎన్నిక కావటం శుభపరిణామమని ఎంపీ కేశినేని శివనాథ్ పేర్కొన్నారు. తొలి నిర్ణయంగా ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.కోటి విరాళం వరద బాధితులకు అందజేస్తామని ఆయన ప్రకటించారు. అన్ని ప్రాంతాల్లో వసతులతో ఉప కేంద్రాలు ఏర్పాటు చేసి నైపుణ్యం ఉన్న ఆటగాళ్లను వెలుగులోకి తీసుకొస్తామన్నారు. ఇప్పటివరకు విశాఖ ఒక్కటే అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌లకు వేదికగా ఉందన్నారు. ఇకపై మంగళగిరి, కడపల్లో కూడా అంతర్జాతీయ మ్యాచ్‌లు జరిగేలా కృషి చేస్తామని ఎంపీ కేశినేని శివనాథ్ హామీ ఇచ్చారు.

Read Also: Kolleru Lake: కొల్లేరులోకి భారీగా పెరిగిన వరద నీరు.. నీట మునిగిన గ్రామాలు